హైదరాబాద్ : సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రొటెం చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ కష్ట కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నుండి ప్రజలను సురక్షితంగా కాపాడాలని లాక్డౌన్ విధించినట్లు తెలిపారు.
కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గిన తరుణంలో లాక్డౌన్ తొలగించడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం కూడా తెలంగాణ రాష్టాన్ని చిన్నచూపు చూడకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి కార్యదర్శి నరసింహచార్యులు పాల్గొన్నారు.