హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆలయ ఈఓ గీతారెడ్డి, అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిసిన వారు ఆహ్వాన పత్రిక అందజేశారు. నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు.. ఈనెల 25 వరకు పదకొండు రోజులపాటు వైభవంగా జరగనున్నాయి. యాదాద్రిలో ఏటా ఫాల్గుణ మాసంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలిరోజు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు ఇవాళ శ్రీకారం చుట్టారు.
రెండోరోజు ధ్వజారోహణ, మూడో రోజు నుంచి అలంకరణ సేవలు జరుగుతాయి. 21న విశేష ఉత్సవాలు ప్రారంభమవుతాయి.. ఇందులో భాగంగా అదేరోజు ఎదుర్కోళ్లు, 22న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 23న దివ్య విమాన రథోత్సవం 24న శ్రీచక్ర తీర్థ స్నానం జరగుతాయి. 25న అష్టోత్తర శతఘటాభిషేకాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈనెల 22న బాలాలయంలో జరగనున్న స్వామివారి తిరుకల్యాణానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఇప్పటికే ఆహ్వానం అందింది.