న్యూఢిల్లీ: ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దేశంలో సవాల్ పరిస్థితి మరోసారి నెలకొన్నదని అన్నారు. కరోనా అత్యవసర పరిస్థితిని అదిగమించేందుకు సూచనలు ఇవ్వాలని సీఎంలను కోరారు. రెండో దశ కరోనా తీవ్రతపై పోరాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు తొలి దశను అదిగమించాయని చెప్పారు. ఇది చాలా ఆందోళనకరమని అన్నారు. ప్రజలు చాలా తేలికగా తీసుకుంటున్నారని, అధికారులు రిలాక్స్ అయ్యారని వ్యాఖ్యానించారు.
కరోనాపై మరోసారి యుద్ధప్రాతిపదికన పోరాడాల్సిన అవసరం ఉన్నదని మోదీ తెలిపారు. సవాళ్లు ఉన్నప్పటికీ, వ్యాక్సిన్లు, వనరులు, అనుభవం వంటివి మనకు ఉన్నాయని చెప్పారు. కరోనా పరీక్షలపై ప్రత్యేక దృష్టిసారించాలని సీఎంలకు పిలుపునిచ్చారు. 70 శాతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు లక్ష్యంగా ఉండాలన్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగినా పట్టించుకోవద్దని, టెస్టులను ఎక్కువగా చేయాలని సూచించారు. నమూనాల సేకరణ విధానం ప్రామాణికంగా జరుగాలని, సరైన గవర్నెస్ ద్వారా దీనిని చెక్ చేయవచ్చని తెలిపారు.
ట్రేసింగ్, ట్రాకింగ్ ద్వారానే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సీఎంలకు మోదీ సూచించారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లపై ప్రధానంగా దృష్టిసారించాలని అన్నారు. పలు రాష్ట్రల్లో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను కరోనాపై అవగాహన కోసం కరోనా కర్ఫ్యూగా వ్యవహరించాలని తెలిపారు. కర్ఫ్యూ సమయాన్ని రాత్రి పది గంటలకు బదులు రాత్రి 9 గంటలకు ప్రారంభించి ఉదయం 5 లేదా 6 గంటల వరకు అమలు చేయడం మంచిదన్నారు. కరోనా మరణాల రేటు తక్కువగా ఉండేలా చూడాలని, రోగుల అనారోగ్యానికి సంబంధించిన సమగ్ర డేటా ద్వారా వారి జీవితాలను కాపాడవచ్చని తెలిపారు.
కరోనా సెఫ్టీ నిబంధనలు పాటించడం, మాస్కులు ధరించడంపై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని మోదీ అన్నారు. కరోనా పరీక్షలను పట్టించుకోకుండా వ్యాక్సిన్పై దృష్టిసారించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని తెలిపారు. వ్యాక్సిన్ లేని సమయంలో మనం కరోనాపై పోరాడిన సంగతిని గుర్తించుకోవాలని అన్నారు. అందుకే కరోనా పరీక్షలపైనే ప్రధానంగా దృష్టిసారించాలని సూచించారు. ఒక్క రాష్ట్రంలోనే కరోనా టీకాలను ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదన్నారు. దేశాన్ని దృష్టిలో ఉంచుకుని టీకాల పంపిణీ నిర్వాహణ ఉండాలని సూచించారు.