సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
కాగజ్నగర్ రూరల్, జూన్ 4 : రైతుల సంక్షేమానికి కృషిచేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పథకం ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో రైతులు రెండు పంటలు పండిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. వరి ధాన్యం పండిచే రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. అంతకుముందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కాసం శ్రీనివాస్, కమిటీ సభ్యులతో డీఎంవో గజానన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడం అదృష్టమని, రైతుల అభ్యున్నతి పాటుపడుతూ అందుబాటులో ఉంటానన్నారు.
నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటలను వ్యవసాయ మార్కెట్కు తీసుకవచ్చి ప్రభుత్వం నిర్ణయించిన ధరను పొందేలా చూస్తామని తెలిపారు. ప్రజల ఆశిస్సులతో మార్కెట్ కమిటీని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేలా కృషిచేస్తానన్నారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం కమిటీ చైర్మన్, సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, వైస్ చైర్మన్ గిరీశ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ఉమామహేశ్వర్రావు, ఎంపీపీ శంకర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలువేరు సత్యనారాయణ, కోశాధికారి గర్రెపెల్లి గోపాల్, సభ్యుడు మైలారపు మురళి, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఘనపురం శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డోకె రాజన్న, డైరెక్టర్లు పిర్సింగుల పోచయ్య, నైతం సత్తయ్య, మహ్మద్ నజీర్, రాణీరాయ్, లక్ష్మణ్, మెడిపల్లి సదాశివ్, ఓం ప్రకాశ్ బజాజ్, తోట తిరుపతి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.