మూడుదశాబ్దాల సుదీర్ఘ సినిమా ప్రయాణంలో కమర్షియల్ సినిమాకు చిరునామాగా నిలిచారు బి.గోపాల్. ఎందరో హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ అందించారు. రియల్లైఫ్లో మృదుస్వభావిగా కనిపించే బి.గోపాల్ తెరపై మాత్రం పతాకస్థాయిలో ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తారు. చాలాకాలం విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. గోపీచంద్, నయనతార జంటగా నటించారు. ఈ నెల 8న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం బి.గోపాల్ పాత్రికేయులతో సంభాషించారు.
పక్కా కమర్షియల్ చిత్రమిది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. ఎలాంటి లక్ష్యం లేకుండా తిరిగే కొడుకు తన కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు ఎలా స్పందించాడు? ఫ్యామిలీని రక్షించుకోవడానికి శత్రువులతో ఎటువంటి పోరాటం చేశాడన్నదే చిత్ర కథాంశం. తండ్రీకొడుకులుగా ప్రకాష్రాజ్, గోపీచంద్ అభినయం అందరిని ఆకట్టుకుంటుంది. వారి మధ్యన వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ఆయువుపట్టులా ఉంటాయి.
నేను1985లో సినీరంగంలోకి వచ్చాను. 35 సినిమాలకు దర్శకత్వం వహించా. ట్రెండ్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నా. నాకు కథా రచన, స్క్రిప్ట్ మేకింగ్ గురించి అంతగా అవగాహన లేదు. రచయితలు మంచి కథలు అందిస్తే నా సృజనాత్మకతను మేళవించి అందరు మెచ్చేలా తెరకెక్కిస్తుంటా. సినిమా ఫలితాన్ని అంతిమంగా కథే నిర్ణయిస్తుంది. సినిమాలో ఎన్ని హంగులున్నా కథలో దమ్ములేకపోతే అది విజయాన్ని దక్కించుకోలేదు. అగ్రహీరోలతో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని అందించాను. బాలకృష్ణతో సినిమా చేయాలనుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తరహాలో ఫ్యాక్షన్ నేపథ్యంలో కథ గురించి అన్వేషిస్తున్నా. కొందరు అగ్ర రచయితలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.
నేను బయట సౌమ్యంగా, శాంతస్వభావిలా కనిపించినా తెరపై మాత్రం హైవోల్టేజ్ యాక్షన్ను పండిస్తా. హీరోల ఇమేజ్ను బట్టి సన్నివేశాల్ని ఎలివేట్ చేయడం, పోరాటఘట్టాల్ని రోమాంచితంగా తీర్చిదిద్దడం నా బలంగా భావిస్తా. ఎలాంటి కథాంశాన్ని ఎంచుకున్నా వాణిజ్య పంథాలోనే ప్రేక్షకులకు చేరవేయాలన్నది దర్శకుడిగా నేను నమ్మే సిద్ధాంతం. ప్రస్తుతం దర్శకులకు మంచి పారితోషికాలు లభిస్తున్నాయి. మా తరంలో ఈ స్థాయి రెమ్యునరేషన్స్ ఉండేవి కావు. ఓటీటీలతో పాటు ఎలాంటి వేదికలొచ్చినా థియేటర్కు ఏమాత్రం డోకా ఉండదు. నేను కూడా థియేటర్లోనే సినిమా చూడటానికి ఇష్టపడతాను.
‘ఇప్పటివరకు భారతీయ సినిమాలో ఇలాంటి కథ రాలేదు. అరణ్యం నేపథ్యంలో ఓ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. కలకాలం గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని చెప్పింది రకుల్ప్రీత్సింగ్. ఆమె వైష్ణవ్తేజ్ సరసన కథానాయికగా నటించిన చిత్రం ‘కొండపొలం’. క్రిష్ దర్శకుడు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ నెల 8న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా రకుల్ప్రీత్సింగ్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..
దర్శకుడు క్రిష్ కథ చెప్పగానే ఎంతో ఉద్వేగానికిలోనయ్యా. ఇందులో నేను మారుమూల పల్లెటూరి అమ్మాయి ఓబులమ్మగా కనిపిస్తా. ‘కరెంట్తీగ’ ‘రారండోయ్ వేడుకచూద్దాం’ ‘ఖాకీ’ వంటి చిత్రాల్లో నేను గ్రామీణ అమ్మాయి పాత్రల్ని పోషించా. అయితే ఈ సినిమాలో గొర్రెలు కాసే అమ్మాయిగా నా పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. షూటింగ్ సమయంలో రాయలసీమ యాస నేర్చుకున్నా. సినిమా మొత్తం ఒకే రకమైన వస్ర్తాలతో, తక్కువ నగలు ధరించి చాలా సహజంగా కనిపిస్తాను. గొర్రెల మంద నేపథ్యంలో చాలా సన్నివేశాల్ని చేశాం. తొలుత గొర్రెలు మా ఆధీనంలో అస్సలు ఉండేవి కావు. నాలుగైదు రోజుల్లోనే వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలిసిపోయింది.
కథాంశాల ఎంపికలో నా ఆలోచనలు మారాయి. అందుకే సెలెక్టివ్గా ఉంటున్నా. ఏవో కొన్ని సన్నివేశాలు, పాటలకు పరిమితమైపోయే పాత్రలు చేయాలనుకోవడం లేదు. ‘కొండపొలం’ వంటి సవాలుతో కూడిన పాత్రలు వస్తేనే ఒప్పుకొంటున్నా. తెలుగులో సినిమాలు తగ్గించడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు. కథలు నచ్చితే ఏ భాషలోనైనా సినిమాలు చేస్తా. ప్రస్తుతం బాలీవుడ్లో ఆరు సినిమాలు చేస్తున్నా. అందుకే ముంబయిలోనే ఉంటున్నా. అయితే తెలుగు టీం మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. అందరం తెలుగులోనే మాట్లాడుకుంటాం. ముంబయిలో అందరు నన్ను తెలుగమ్మాయినని అనుకుంటారు. డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు కానీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే’ ‘బాహుబలి’ వంటి ఒక్క సినిమాలోనైనా నటిస్తే చాలనిపిస్తుంది. ‘కొండపొలం’అలాంటి కథ అవుతుందన్న విశ్వాసముంది. ఓటీటీలో ఆఫర్లొస్తున్నాయి. ఇప్పటివరకు ఏ కథ అంగీకరించలేదు. ప్రయోగాత్మక, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ దొరికితే ఓటీటీలో నటిస్తా. ‘కరణం మల్లీశ్వరీ’ బయోపిక్లో నటిస్తానని వస్తున్న వార్తల్లో
నిజం లేదు.
ఈ సినిమా షూటింగ్ కోసం నెలరోజుల పాటు వికారాబాద్ అడవి దగ్గరలోని ఓ రిసార్ట్లో బస చేశాం. అడవిలో షూటింగ్ చేయడం మాటల్లో వ్యక్తం చేయలేని అనుభూతుల్ని మిగిల్చింది. ప్రతి రోజు పొద్దున్నే షూటింగ్కు బయలుదేరి వెళ్లేవాళ్లం. మా కారవ్యాన్లను రోడ్డు పక్కన నిలిపివేసేవారు. షూటింగ్ కోసం అడవిలోకి చాలా దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ప్రతి రోజు ట్రెక్కింగ్ చేసినట్లుగా అనిపించేది. ప్రత్యేకమైన వ్యాయామం అవసరం లేకుండా నా రోజువారి వర్కవుట్లను కూడా పూర్తి చేసినట్లుగా ఫీలయ్యాను. నా పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెబుదామనుకున్నా. ఇతర సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు.