గత బడ్జెట్ కంటే రెట్టింపయ్యే అవకాశం
కలెక్టర్ ఆమోదమే తరువాయి
వరంగల్, మార్చి 23 : గ్రేటర్ కార్పొరేషన్ 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 31వ తేదీలోగా బల్దియా బడ్జెట్ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ అధికారులు పది రోజులుగా బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పాలక మండలి గడువు ముగియడంతో ఎలాంటి సమావేశం లేకుండా గ్రేటర్ ప్రత్యేకాధికారి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు గ్రేటర్ బడ్జెట్ను ఆమోదించనున్నారు. ఇప్పటికే రూపొందించిన బడ్జెట్ను కమిషనర్ సత్పతి పరిశీలించారు. గత ఏడాది బడ్జెట్ కంటే ఈ ఏడాది తయారు చేస్తున్న బడ్జెట్ అంచనాలు పెరిగే అవకాశాలున్నాయి.
పెరుగనున్న అంచనాలు
బల్దియా బడ్జెట్ అంచనాలు పెరుగనున్నాయి. గత ఏడాది బడ్జెట్ కంటే ఈ సంవత్సరానికి రూపొందిస్తున్న బడ్జెట్ రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.203కోట్లతో కౌన్సిల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు అప్పుటి పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్కు రూ. 250 కోట్లు కేటాయించిన నేపథ్యంలో బల్దియా బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2021-22 గ్రేటర్ బడ్జెట్ రూ.450 నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండే అవకాశాలున్నాయి. కాగా, రెండు, మూడు రోజుల్లో గ్రేటర్ బడ్జెట్కు ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేయనున్నారు.