రూ.63 లక్షల విలువైన అభరణాల అపహరణ
కేసును ఛేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్
ఖమ్మం మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కారేపల్లి రూరల్: సొంత ఇంటికే కన్నం వేసి రూ.63 లక్షలు విలువ చేసే బంగారు, వెండి అభరణాలను అపహరించిన కేసును కారేపల్లి పోలీసులు ఛేదించారు. భర్తతో విభేదాల వచ్చి ప్రియుడితో కలిసి జీవించడానికి నిర్ణయించుకున్న మహిళ కారేపల్లిలోని భర్త ఇంట్లో చోరీకి పాల్పడింది. సోమవారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్.వారియర్ నగరంలోని కమిషనరేట్లో వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన శివప్రకాశ్ దారక్ అనే వ్యక్తికి 2008లో ఇదే ఊరికి చెందిన అర్చన అనే మహిళతో వివాహమైంది. శివప్రకాశ్ కారేపల్లి ప్రాంతంలో బంగారు ఆభరణాలు తనఖా పెట్టుకునే వ్యాపారం చేస్తుంటాడు. వీరికి ముగ్గురు సంతానం. కొన్నాళ్ల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి ఇద్దరూ వేరుగా జీవిస్తున్నారు. భార్య పిల్లలతో కలిసి గుంటూరులోని పుట్టింట్లోనే ఉంటున్నది. గత నెలలో శివప్రకాశ్ ధారక్ తల్లి మరణించడంతో అర్చన కారేపల్లికి చేరుకున్నది. భర్తను వీడిన అర్చన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం గన్నవరానికి చెందిన బత్తుల వెంకటకృష్ణప్రసాద్తో అప్పటికే వివాహేతర సంబంధం నెరపుతున్నది.
ప్రియుడితో కలిసి బంగారు ఆభరణాలు తీసుకుని ఉడాయించాలని పథకం రచించింది. ఈ నెల 3న కృష్ణప్రసాద్ కారేపల్లి చేరుకున్నాడు. కారేపల్లి రైల్వేస్టేషన్లోనే బస చేశాడు. 4 వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో లాకర్ తాళాలు తెరిచిన అర్చన బంగారం, వెండి అభరణాలు, ల్యాప్టాప్ను అపహరించి కృష్ణప్రసాద్కు అప్పగించింది. తర్వాత రోజు నగదు అపహరణకు గురైనట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడిషనల్ డీసీపీ సుభాశ్ చంద్రబోస్, రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి, సీసీఎస్ ఏసీపీ జహంగీర్ రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా సాక్ష్యాలు సేకరించి నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి రూ.63 లక్షల విలువ చేసే కిలోకు పైగా బంగారు ఆభరణాలను, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఖమ్మం సీసీఎస్ సీఐలు నవీన్, శ్రీనివాస్ కారేపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేశ్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మంగిత్యా, గజేందర్, టెక్నికల్ టీం ఖాలీద్, శ్రీధర్ను పోలీస్ కమిషనర్ అభినందించారు.