న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ వస్తుందని, అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. సెప్టెంబర్ నుంచి 12-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ చీఫ్ ఎన్కే అరోరా వెల్లడించారు. జైడస్ వ్యాక్సిన్నే వీరికి వేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. రానున్న వారాల్లో జైడస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయని కూడా అరోరా తెలిపారు.
కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయి. అప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అనుకుంటున్నాను. మూడో త్రైమాసికం లేదా వచ్చే జనవరి-ఫిబ్రవరిలోపు 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇస్తాము. అయితే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ మాత్రం 12-18 ఏళ్ల వారికి ఆలోపే అందుబాటులోకి వస్తుంది అని అరోరా స్పష్టం చేశారు. స్కూళ్లను పునఃప్రారంభించడం అన్నది చాలా ముఖ్యమని, దీనిపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు.
736 జిల్లాల్లో పీడియాట్రిక్ సెంటర్లు
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో పీడియాట్రిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికితోడు ప్రతి రాష్ట్రం/యూటీలో పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మెరుగైన వసతుల కల్పన కోసం రూ.23 వేల కోట్లను కేంద్రం కేటాయించింది.