‘కుటుంబ విలువల కలబోతగా అర్థం, పరమార్థంతో తెరకెక్కిన మంచి సినిమా ఇది. అక్కాతమ్ముళ్ల అనుబంధం కన్నీళ్లు పెట్టిస్తుంది’ అని అన్నారు ప్రముఖ నటుడు మోహన్బాబు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ‘మోసగాళ్లు’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. కాజల్ ప్రధాన పాత్రధారి. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. మోహన్బాబు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో విష్ణు అక్క పాత్రలో కాజల్ నటించింది. ఇలాంటి పాత్రను అంగీకరించడానికి ధైర్యం కావాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో మోసపోతూనే ఉంటారు. మోసాన్ని నేపథ్యంగా తీసుకొని దేశంలోనే జరిగిన గొప్ప ఐటీ స్కామ్ ఆధారంగా విష్ణు ఈ సినిమా రూపొందించాడు. ఏడాది పాటు ఈ కథపై పరిశోధన చేశాడు. అతడి కష్టానికి ప్రతిఫలం దక్కాలి. నా పుట్టినరోజునాడు విడుదలవుతున్న ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అన్నారు. ‘సునీల్శెట్టితో నటించిన ప్రతి క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కథ వినగానే అను పాత్రలో నటించడానికి కాజల్ అంగీకరించడం అదృష్టంగా భావిస్తున్నా’ అని మంచు విష్ణు తెలిపారు.