‘విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవాన్ని తెచ్చిపెట్టిన చిత్రమిది. వ్యవసాయం నేపథ్యంలో గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఎవరూ స్పృశించని అంశాలతో వినూత్నంగా తెరకెక్కించాం’ అని అన్నారు కిశోర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘శ్రీకారం’. శర్వానంద్ హీరోగా నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో కిశోర్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సినిమాలోని తండ్రీకొడుకుల అనుబంధంతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతున్నారు. కమర్షియాలిటీ కంటే కథను తెరపై ఎంత ఆసక్తిగా చెప్పామన్నది నేడు ప్రధానంగా మారిపోయింది. ఆ ఆలోచనతోనే వాస్తవికతకు ప్రాముఖ్యతనిస్తూ నిజాయితీగా ఈ సినిమా చేశాం. తొలుత ‘శ్రీకారం’ పేరుతో 2016లో లఘు చిత్రాన్ని చేశా. అది చూసిన 14 రీల్స్ ప్లస్ సంస్థ దానిని సినిమాగా చేయమని అడగటంతో అంగీకరించా. నిర్మాతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట నన్ను నమ్మి నాలుగేళ్లు సినిమాతో ప్రయాణం చేశారు. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం నిర్మాతలదే. వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం నాది. నేను పుట్టి పెరిగిన పరిసరాలతో పాటు వ్యవసాయ కుటుంబాలపై నాకున్న అవగాహనతో ఈ కథను రాసుకున్నా. శర్వానంద్ నటన ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. హరీష్శంకర్, బాబీ, సాగర్ కె చంద్ర, చైతన్యకృష్ణ, హను రాఘవపూడితో పాటు పలువురు దర్శకులు వాస్తవికతను ప్రతిబింబిస్తూ మంచి సినిమా చేశానని ప్రశంసించారు. దర్శకుడిగా మైథలాజికల్ సినిమాలు చేయాలనుంది. తదుపరి సినిమా కోసం యాక్షన్ కథను రాసుకున్నా’ అని తెలిపారు.