న్యూఢిల్లీ : ఢిల్లీలోని పలు దవాఖానల్లో ఆక్సిజన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సానుకూల చర్యలు చేపడితేనే విషాద ఘటనలను అధిగమిస్తామని కేజ్రీవాల్ సర్కార్ కు కేంద్రం హితవుపలికింది. నగర ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అవసరమైన ట్యాంకర్లను ఏర్పాటు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలం కావడంపై కేంద్రం మండిపడింది.
ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించాలంటే తక్షణం ఫలితాలను ఇచ్చే చర్యలు అవసరమని స్పష్టం చేసింది. ఆక్సిజన్ తరలింపునకు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సరైన విధంగా లేవని ముఖ్య కార్యదర్శి విజయ్ దేవ్ కు రాసిన లేఖలో కేంద్రం హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఢిల్లీ సర్కార్ పేలవంగా వ్యవహరిస్తోందని అన్నారు.