సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక మట్టిలో మాణిక్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏం చదువుకోకపోయిన, కనీసం పేపర్లో ఉన్నది చూసి కూడా చదవలేకపోయినప్పటికీ వారు తమ గొంతుతో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య బేబి అనే పేద మహిళ తన పాటతో ఎంత మందిని అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిరు, ఏఆర్ రెహమాన్ వంటి లెజెండ్స్ కూడా ఆమె పాటకు ఫిదా అయ్యారు.
ఇక ఇప్పుడు 80 ఏళ్ళ వయసు ఉన్న దాసరి పొలమ్మ అనే బామ్మ తన స్వరంతో అలరిస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఆదిఆంధ్రా వీధిలో నివాసముంటోంది. కుటుంబ పోషణ కోసం కూరగాయలు, పళ్ళు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. అలనాటి మధుర గీతాలని వినసొంపుగా పాడుతూ అక్కడి వారిని అలరిస్తుంది. ఈ వయస్సులోను ఆమె గొంతులో అదే శ్రావ్యత ఉండడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరు అయితే ఆమె ఇంటికి వచ్చి మరీ పాటలు పాడించుకుంటూ ఆనందిస్తున్నారు.