ఓవైపు కరోనా విళయతాండవం చేస్తుంది.. మరోవైపు ఇండస్ట్రీలో మరణమృదంగం మోగుతుంది. అంతులేని విషాదానికి నిదర్శనంగా మారిపోతుంది సినిమా ఇండస్ట్రీ. పిట్టల్లా రాలిపోతున్నారు ప్రముఖులు. కేవలం రెండు రోజుల్లోనే ఐదుగురు మృత్యువాత పడటం విషాదాన్ని నింపుతుంది. అందులో నలుగురు కోవిడ్ తోనే మరణించారు. ఒక్కరు మాత్రమే అనారోగ్యంతో కన్నుమూసారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా అయిపోతుంది పరిస్థితి. తాజాగా మరో దర్శకుడు కరోనాతోనే చనిపోయాడు. అతడి పేరు శ్రవణ్. 8 ఏళ్ళ కింద వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ప్రియుడు సినిమాను తెరకెక్కించాడు ఈయన. విఎన్ ఆదిత్య దగ్గర దాదాపు పదేళ్లకు పైగా పని చేసాడు.
ఆదిత్య దగ్గరే శ్రీరామ్, మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి సినిమాలకు వర్క్ చేసాడు. దాంతో పాటు మరో 20 సినిమాల వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పని చేసాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు కరోనాతో కన్నుమూసాడు. ఈయనతో పాటు హిందీ నటుడు, సాహోతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన బిక్రమ్ జీత్ కూడా కరోనాతోనే చనిపోయాడు. ఈయన వయసు కేవలం 52 సంవత్సరాలు మాత్రమే. మరోవైపు ఎప్రిల్ 30న ముగ్గురు ప్రముఖులు కన్నుమూసారు. ఉదయమే ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ మృతితో రోజు మొదలైంది. ఆ తర్వాత కొన్ని గంటలకే తమిళ సీనియర్ నటుడు చెల్లాదొరై గుండెపోటుతో మరణించాడు.
అంతలోనే సాయంత్రం మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. శ్రీ విష్ణు హీరోగా మా అబ్బాయి సినిమాను తెరకెక్కించిన 39 ఏళ్ళ దర్శకుడు కుమార్ వట్టి కూడా కరోనాతోనే కన్నుమూసాడు. ఈ మరణ మృదంగం చూస్తుంటే అంతా భయపడిపోతున్నారు. ఒక్కొక్కరుగా అలా దూరం అవుతుంటే చూసి కన్నీరు పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. ఈ చావులను చూసైనా ఇంట్లోనే ఉండండి అంటూ వేడుకుంటున్నారు ప్రముఖులు. ఏదేమైనా కూడా ఇండస్ట్రీలో మాత్రం ఈ మరణవార్తలతో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. మరి ఈ విషాదాలకు అంతెక్కడ ఉందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు