‘సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు అయ్యింది. సుదీర్ఘ ప్రయాణంలో చిన్న సినిమాల్ని బతికించడానికి నిరంతరం పోరాడుతూనే ఉన్నా’ అని అన్నారు నట్టికుమార్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో నట్టికుమార్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఈ ఏడాది పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది. ‘డీఎస్జే’ సినిమా ద్వారా హీరోయిన్గా నా కూతురు కరుణ, ‘సైకోవర్మ’తో హీరోగా తనయుడు క్రాంతి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. నటన పట్ల మక్కువతోనే వారు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు ఇరవై ఏళ్ల విరామం తర్వాత ఈ ఏడాది నేను మళ్లీ దర్శకత్వబాధ్యతల్ని స్వీకరించాను. పదిమంది బాగుండాలన్నదే నా సిద్ధాంతం. దానిని నమ్మే సమాజం, ఇండస్ట్రీలోని సమస్యలపై పోరాడుతున్నా. సినిమాల పట్ల ప్రేమతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న కొత్తవారు బాగుండాలన్నదే నా ఆశయం. నా కూతురు నట్టి కరుణ ప్రధాన పాత్రలో ‘కశ్మీర్ మనదేరా’ పేరుతో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నా. 370 ఆర్టికల్ నేపథ్యంలో మహిళల హక్కుల ప్రధానంగా ఈ సినిమా ఉంటుంది. రాజశేఖర్తో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నా’ అనితెలిపారు.