బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’ తెలుగు చిత్రసీమలో అజరామరమైన సినిమాగా నిలిచింది.టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్గా పెద్ద విజయాన్ని సాధించి ఆబాలగోపాలాన్ని అలరించింది. తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. ఈ చిత్రం విడుదలై నేటికి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా తాలూకు అనుభవాల్ని గురించి బాలకృష్ణ మాట్లాడుతూ “ఆదిత్య 369’ అద్భుతం, అజరామరం. ప్రజల హృదయాల్లో, కళాభిమానుల లైబ్రరీల్లో ఉండిపోయే సినిమాలు, వాళ్లు ఎప్పుడూ మాట్లాడుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమిది. సినిమా విడుదలై ముప్పై ఏళ్లు పూర్తవడం సంతోషంగా ఉంది. అన్ని తరాలకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు శ్రీకృష్ణదేవరాయలు పాత్ర హృదయంలా నిలిచింది. తెనాలి రామకృష్ణ, మహామంత్రి తిమ్మరుసు చిత్రాల్లో నాన్నగారు ఎన్టీఆర్, శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చేశారు. ఆ పాత్రను సింగీతం శ్రీనివాసరావు అద్భుతంగా ఈ సినిమాలో పునఃసృష్టించారు. గ్రాఫిక్స్ లేని రోజుల్లో వీహెచ్ఎస్ కెమెరాతో సినిమాను షూట్ చేశాం. ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమిది. భవిష్యత్తులో ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్, టైమ్ మిషన్ సినిమా ఇది. నేను చేసిన వాటిలో ఈ రోజులకు అన్వయించుకునే ఒకే ఒక్క సినిమాగా ‘ఆదిత్య 369’ ప్రత్యేకతను సంతరించుకున్నది’ అని చెప్పారు.