38 ఏళ్ళ జూనియర్ ఎన్టీఆర్ జీవితంలో 25 సంవత్సరాల సినిమా కెరీర్ ఉంది. ఈయన ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 14, 1996లో వచ్చిన బాల రామాయణం సినిమాతో ఆయన తొలిసారి వెండితెరపై కనిపించాడు. తాజాగా ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమ సినిమా పాతికేళ్ళు కంప్లీట్ చేసుకోవడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు సోషల్ మీడియాలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా చేయడానికి దర్శకుడు గుణశేఖర్ చాలా కష్టపడ్డాడు. మొత్తం పిల్లలతోనే ఒక అద్భుతమైన సినిమా చేయాలని భావిస్తున్న తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ గుణశేఖర్ కంట పడ్డాడు. అప్పటికే నాట్యంలో శిక్షణ తీసుకుని అనేక ప్రదర్శనలు ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ను తన సినిమాలో రాముడు వేషం కోసం ఎంపిక చేసుకున్నాడు ఈ దర్శకుడు.
ఆ తర్వాత మిగిలిన బాలనటులు ఒక్కొక్కరుగా వచ్చి బాల రామాయణంలో భాగమయ్యారు. పాతికేళ్ల కిందే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయించాడు గుణశేఖర్. మరోవైపు కథపై నమ్మకంతో నిర్మాత ఎం.ఎస్.రెడ్డి కూడా అత్యంత భారీ తనంతో బాల రామాయణం సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఇప్పటికి చూసినా అదే ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. అప్పట్లో ఈ సినిమాకు ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ముఖ్యంగా రాముడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన విమర్శకుల ప్రశంసలతో పాటు తాతకు తగ్గ మనవడు అనే గుర్తింపు కూడా తీసుకొచ్చింది. ఇందులో నటించిన చాలామంది బాల నటులు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఎవరికి వాళ్ళు సపరేట్ ప్రొఫెషన్స్ ఎంచుకొని అందులో రాణిస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాలో సీతగా నటించిన స్మితా మాధవ్ ఆ ఒక్క సినిమాతోనే నటనకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత క్లాసికల్ డాన్సర్ గా ఎన్నో పర్ఫార్మెన్స్ చేసింది. జెమిని, విజయ్ టీవీ లాంటి చానల్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఫారిన్ వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం విడుదలైన మూడేళ్లకు నిన్ను చూడాలని సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రేంజ్ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తానికి ఏదేమైనా బాల రామాయణం సినిమా అప్పట్లో ఒక సంచలనం. అంతమంది చిన్న పిల్లలతో అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చూసి చిరంజీవి కూడా గుణశేఖర్ కు అవకాశం ఇచ్చాడు. అలాంటి అద్భుతమైన మైథలాజికల్ వండర్ పాతికేళ్లు పూర్తి చేసుకుంది.