2020ని తలుచుకుంటేనే చాలా మంది భయపడుతుంటారు. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సినిమా వాళ్లు గతేడాది చనిపోయారు. 2021లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. మరీ ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో అయితే చాలా మంది ప్రముఖులు మరణిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ రెండు మూడు రోజులకు ఓ మరణవార్త వినాల్సి వస్తుంది. తాజాగా లెజెండరీ సినిమాటోగ్రఫర్, ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ గుండెపోటుతో మరణించడం అందర్నీ కలచివేస్తుంది. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఈయన మరణించడం నిజంగానే బాధాకరం. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆనంద్ కు చనిపోయే ముందు రోజు రాత్రి గుండెలో కాస్త మంటగా అనిపించడంతో తనే స్వయంగా కార్ నడుపుకుంటూ వెళ్లి దగ్గర్లోని ఆస్పత్రిలో చేరారు. అక్కడ చేరిన కొన్ని గంటలకే మరోసారి గుండెపోటు రావడంతో మరణించాడు.
రెండు రోజుల ముందు ప్రముఖ దర్శకుడు తమిర కరోనాతో కన్నుమూసాడు. ఈయన కంటే వారం రోజుల ముందు తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతోనే మరణించాడు. ఈయన మరణం కూడా తమిళ ఇండస్ట్రీకి షాక్. ఇక స్టార్ హీరోలతో సినిమాలు చేసి నేషనల్ అవార్డులు సైతం గెలుచుకున్న దిగ్గజ దర్శకుడు ఎస్పీ జననాథన్ 2021లోనే అనారోగ్యంతో మరణించారు. ఈయన చివరి సినిమా విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటిస్తున్న లాభం ఇంకా విడుదల కాలేదు. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నపుడే ఆయన మరణించాడు.
కేవలం వీళ్లు మాత్రమే కాదు.. ప్రేమిస్తే సినిమాలో హీరో అవుతాను అంటూ నవ్వించిన కమెడియన్ విరుచగకాంత్ ఉరఫ్ పల్లు బాబు రోడ్డు పక్కన ఆటోలో తినడానికి తిండిలేక చనిపోయాడు. అలాగే అజిత్ హీరోగా నటించిన బిల్లా 2లో నవ్వులు పూయించిన తీపట్టి గణేష్ కూడా 2021లోనే మరణించాడు. 40 సినిమాలకు పైగా నటించిన అనుభవం ఉన్న తమిళ నటుడు తావసి కూడా క్యాన్సర్ తో ఈ మధ్యే కన్నుమూసాడు. తమిళనాట టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఇంద్ర కుమార్ ఫిబ్రవరి 2021లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇలా 2021లో ఇప్పటి వరకు దాదాపు 25 మంది తమిళ సినీ ప్రముఖులు మరణించారు.