సమ్మర్ సీజన్ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ పండగ చేసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు సెలవులు వస్తాయి. పిల్లలకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అలాంటి సమయంలో సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి. అందుకే ఏడాది ముందు నుంచి సమ్మర్ సీజన్ లో తమ సినిమాని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా వరుసగా రెండోసారి కూడా సమ్మర్ సీజన్ నీరుగారి పోయేలా కనిపిస్తుంది. 2020 సమ్మర్ మొత్తం వైరస్ తుడిచి పెట్టేసింది. ఒకటి రెండు కాదు దాదాపు 20 సినిమాలకు పైగా వాయిదా పడ్డాయి. అయిందేదో అయిపోయింది 2021 వేసవిలో సినిమాలు విడుదల చేద్దాం అనుకుంటే.. ఇప్పుడు మరోసారి వైరస్ ఉగ్రరూపం దాల్చుతుంది.
గత సమ్మర్ కంటే ఈసారి కరోనా ఇంకాస్త ఉధృతంగా ఉంది. దాంతో మరోసారి తమ సినిమాలను వాయిదా వేయడం మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 9న విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ బహుశా ఈ సీజన్లో చివరి సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ చివరికి అదే జరుగుతుంది. ఏప్రిల్ 16న రావాల్సిన లవ్ స్టోరీ.. 23న రావాల్సిన నాని టక్ జగదీష్.. 30న రావాల్సిన విరాట పర్వం లాంటి సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. దాంతో పాటు చిరంజీవి ఆచార్య కూడా పోస్ట్ పోన్ అయ్యింది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు.. కానీ మొన్న విడుదలైన పోస్టర్లలో రిలీజ్ డేట్ లేదు.
ప్రస్తుతానికి మే 28న రవితేజ కిలాడితో పాటు బాలకృష్ణ అఖండ సినిమా కూడా వస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైరస్ ఇలాగే ఉంటే ఆ సినిమాలు కూడా వాయిదా పడడం లాంఛనమే. అల్లు అర్జున్ పుష్ప సినిమాను కూడా ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఒక్క సినిమా మాత్రమే కాదు ఇంకా చాలా సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే 2021 సమ్మర్ సీజన్ కూడా పూర్తిగా కరోనా వైరస్ కు సమర్పయామి అనక తప్పదు. గత సమ్మర్ లోనే దాదాపు 300 నుంచి 500 కోట్లు నష్టపోయిన తెలుగు ఇండస్ట్రీ.. ఈసారి మరింత ఎక్కువగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోలు కూడా ఈ వేసవిలో రావాలి అనుకున్నారు. కానీ పరిస్థితులు ఇంత దారుణంగా పగ పడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. ఏదేమైనా కూడా కరోనా వైరస్ తెలుగు ఇండస్ట్రీని మరోసారి చావుదెబ్బ కొట్టింది.