న్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయ్మాల్యకు ఇచ్చిన రుణాల వసూళ్లలో ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియానికి శుక్రవారం రిలీఫ్ కలిగింది. మాల్య సారధ్యంలోని యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్ (యూబీఎల్)కు చెందిన షేర్ల విక్రయం ద్వారా ఈ కన్సార్టియం రూ.5,824.5 కోట్ల రుణాలు వసూలు చేసుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది.
కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం ఎస్బీఐ సారధ్యంలోని పలు బ్యాంకుల ద్వారా సుమారు రూ.9000 కోట్ల మేరకు విజయ్ మాల్య రుణాలు తీసుకున్నారు. సకాలంలో రుణాలను చెల్లించడంలో విఫలమైన విజయ్ మాల్య.. బ్రిటన్కు పారిపోయారు. ఆయనను రప్పించేందుకు సీబీఐ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి.
ఈ రుణాలను వసూలు చేయడానికి ఈనెల 23వ తేదీన జరిగిన వేలంలో యూబీఎల్ షేర్లను వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (డీఆర్టీ) విక్రయించింది.
ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు తీర్పు మేరకు రూ.6,624 కోట్ల విలువైన యూబీఎల్ షేర్లను ఎస్బీఐ-కన్సార్టియానికి ఈడీ బదిలీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా యూబీఎల్ షేర్లను ఈడీ ఇంతకుముందే ఈడీ జప్తు చేసింది.
ఈ వేలంలో ఎస్బీఐ సారధ్యంలోని బ్యాంకుల కన్సార్టియం రూ.5,824.5 కోట్లు వసూలు చేసుకుందని ఈడీ తెలిపింది. బుధవారం కూడా ఇదే తరహాలో షేర్ల విక్రయం ద్వారా బ్యాంకులు రూ.1,357 కోట్లు వసూలు చేసుకున్నాయని పేర్కొంది.
ఇదిలా ఉంటే, భారత్కు అప్పగింతకు వ్యతిరేకంగా విజయ్ మాల్య దాఖలు చేసిన పిటిషన్ను బ్రిటన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇక భారత్కు విజయ్ మాల్య అప్పగింత ఖాయం అని ఈడీ తెలిపింది.