న్యూఢిల్లీ, మే 15: కరోనా రెండో వేవ్తో విలవిల్లాడుతున్న పలు రాష్ర్టాలపై ప్రకృతి కూడా పడగెత్తింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘తౌక్టే’ తుఫాన్ గజగజ వణికిస్తున్నది. శనివారం అర్ధరాత్రికి అది అత్యంత తీవ్ర తుఫాన్గా మారనున్నది. అది గుజరాత్ తీరంవైపు కదులుతున్నదని, ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఆ రాష్ట్రంలోని పోర్బందర్, నలియా మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. కేరళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. వేర్వేరుచోట్ల ఇద్దరు మరణించారు. తౌక్టే తుఫాన్ ముప్పుతో కేరళలోని 9 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మణిమాల, అచన్కోవిల్ వంటి నదుల్లో ప్రవాహ స్థాయిలు పెరుగడంతో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరిక జారీ చేసింది.తుఫాన్ ముప్పు రాష్ర్టాల్లో ముందుజాగ్రత్త చర్యలపై ఢిల్లీలో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. గుజరాత్లోని 15 జిల్లాల్లో తమ బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. తౌక్టే ప్రభావంతో సౌరాష్ట్ర లోని పలు ప్రాంతాలలో నష్టం భారీగా ఉంటుందని, ఇండ్లు, రోడ్డు, విద్యుత్తు, సమాచార వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదముందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. గోవాతో పాటు మహారాష్ట్రలోని సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు
తౌక్టే తుఫాన్ తెలంగాణపైనా ప్రభావం చూపనున్నది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడింది. వీటి ప్రభావం వల్ల ఈ నెల17 వరకు ఉరుములు మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో రాష్ట్రంలో పశ్చిమ, దక్షిణ, మధ్య, నైరుతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శనివారం జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నల్లగొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, వరంగల్ రూరల్, సిద్దిపేట, హైదరాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో చిరుజల్లులు కురిశాయి.