సుక్మా: చత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే ఓ సీఆర్పీఎఫ్ కమాండో ప్రస్తుతం మావోల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు స్థానిక జర్నలిస్టులకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ కమాండో తమ దగ్గర ఉన్నట్లు ఫోన్ వచ్చింది. సుక్మా, బీజాపూర్ సరిహద్దుల్లో మిస్సైన ఆ కమాండో తమ ఆధీనంలో ఉన్నట్లు ఆ ఫోన్కాలర్ తెలిపినట్లు జర్నలిస్టులు వెల్లడించారు. అయితే ఆ కమాండో సురక్షితంగా ఉన్నట్లు వారు చెప్పారు. మావో నేత మాద్వి హిద్మా నేతృత్వంలో జవాన్లపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మావోలు ఆ జవాన్ను రిలీజ్ చేస్తారని జర్నలిస్టు, బీజాపూర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గణేశ్ మిశ్రా తెలిపారు.
ఫోన్ చేసిన వ్యక్తి హిద్మా అంటూ చెప్పుకున్నట్లు మరో జర్నలిస్టు రాజా సింగ్ రాథోర్ తెలిపాడు. జవానుకు చెందిన ఫోటోలను, వివరాలను విడుదల చేస్తామని చెప్పినట్లు కూడా ఆ జర్నలిస్టు గుర్తు చేశాడు. తన భర్తను మావోల చెర నుంచి విడిపించాలని ఆ జవాను భార్య మీడియా ముందుకు వేడుకున్నది. ప్రధాని మోదీ, షాలు తన భర్తను సురక్షితంగా తీసుకురావాలని కమాండో భార్య కోరారు. వింగ్ కమాంండర్ అభినందన్ను పాక్ నుంచి తెచ్చినట్లు తన భర్తను తీసుకురావాలని ఆమె వేడుకున్నారు.