లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత నిర్మానుష్యంగా రోడ్లు..
పలుచోట్ల వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 22 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా శనివారం సైతం కొనసాగింది. ఉదయం 10 గంటల నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు సమయం ఉండడంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత తెరిచి ఉంచిన దుకాణాలను పోలీసులు మూసివేయించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన పలు వాహనాలను సీజ్ చేశారు.
బాన్సువాడ పట్టణంలో లాక్డౌన్ను డీఎస్పీ జయపాల్ రెడ్డి పర్యవేక్షించారు. పట్టణంలో ప్రజలు ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసర సరుకుల కోసం పెద్దసంఖ్యలో బయటికి వచ్చారు. మాస్కు ధరించని వారికి జరిమానా విధించారు. 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ప్రశ్నించారు. డీఎస్పీ వెంట పట్టణ ఎస్హెచ్వో రామకృష్ణారెడ్డి, ఎస్సై బషీర్ హైమద్, హెడ్ కానిస్టేబుల్ అమ్రూ తదితరులు ఉన్నారు.
నస్రుల్లాబాద్ మండలంలోని నిజామాబాద్-కామారెడ్డి జిల్లాల సరిహద్దు వద్ద వాహనాల తనిఖీని డీఎస్పీ జయపాల్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్సై మశ్చేందర్రెడ్డి, ట్రైనీ ఎస్సై సతీశ్ ఉన్నారు.
పిట్లం మండలకేంద్రంలో బందోబస్తును ఎస్సై రంజిత్ పర్యవేక్షించారు. మండలకేంద్రంలోని వ్యాపార సముదాయాలను ఉదయం 10 గంటలకు మూసి వేయించా రు. వాహనదారులకు పలు సూచనలు చేశా రు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు.
గాంధారి మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగింది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ తిరుగకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రోడ్లపై మాస్కులు ధరించకుండా తిరిగితే జరిమానా విధిస్తున్నామని ఎస్సై తెలిపారు.
బీర్కూర్లో ఎస్సై కొత్త రాజేశ్ ఆధ్వర్యం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటివరకు 20 వాహనాలను సీజ్చేసినట్లు తెలిపారు. ఆయన వెంట సిబ్బంది సాయిలు, వెంకటేశ్, గంగాధర్, ప్రభుదాస్, యాహియా, శంకరప్ప ఉన్నారు.
రెవెన్యూ, పోలీస్ అధికారులు లాక్డౌన్ ను పకడ్బందీగా అమలుచేయడంతో లింగంపేట మండల కేంద్రం నిర్మానుష్యంగా మారింది. ఉదయం 10 గంటల అనంతరం జన సంచారం లేక రోడ్లన్నీ వెలవెలబోయాయి. పది గంటల అనంతరం తెరిచి ఉన్న దుకాణాలను పోలీసులు మూసివేయించా రు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి పోలీసులు జరిమానా విధించారు.
కామారెడ్డి పట్టణంలో పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. పట్టణంలోని డెయిలీ కూరగాయల మార్కెట్ను పోలీసులు శనివారం వీక్లీమార్కెట్కు తరలించారు. ఉదయం 10 గంటల అనంతరం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణానికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా నిర్వహించారు. ఉదయం పది గంటల తర్వాత జన సంచారం లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
బీబీపేట్ మండలకేంద్రంలో ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు.
బిచ్కుంద మండలకేంద్రంలో ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్తండా గ్రామంలో ఎస్సై శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. లాక్డౌన్ సడలింపు సమయం ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులను ప్రశ్నించారు. పర్మిషన్ లేని 10 మంది వాహనదారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎల్లారెడ్డి శశాంక్రెడ్డి లాక్డౌన్ను పరిశీలించారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకి వచ్చిన పది వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. తాడ్వాయి పోలీస్స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు లాక్డౌన్ నిబంధనలు పాటించని 20 వాహనాలు, 30 షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణమూర్తి వెల్లడించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండలంలో రెండు రోజుల నుంచి ఇప్పటివరకు మాస్కులు ధరించని 40 మందిపై, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 80 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. 32 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు.