డొమినికా: ఇండియా నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డ్రామాలు మెల్లగా బయటపడుతున్నాయి. ఆంటిగ్వా నుంచి తప్పించుకోవడానికి అతడు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తాజాగా వెల్లడైంది. ప్రముఖ న్యూస్ చానెల్ న్యూస్ 18 దీనికి సంబంధించి ఓ వార్త ప్రసారం చేసింది. ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ తనను కచ్చితంగా ఇండియాకు అప్పగిస్తారని భావించిన తర్వాతే చోక్సీ ఇలా కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తేలింది. అతని ఫ్రెండ్ అయిన గొవిన్ అనే వ్యక్తి ఈ డ్రామాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆంటిగ్వా నుంచి క్యూబాలోని సేఫ్ హౌజ్కు అతన్ని తరలించే క్రమంలో డొమినికాలో అడ్డంగా దొరికిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు.
ఇంటర్పోల్ నోటీసులు జారీ చేయడంతో ఆంటిగ్వా నుంచి లీగల్గా బయటపడటం అసాధ్యమని భావించిన తర్వాత చోక్సీ ఇలా అడ్డదారిలో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కరీబియన్ దీవుల్లో ఆంటిగ్వా కాకుండా మరో దేశంలో కూడా చోక్సీకి పౌరసత్వం ఉన్నట్లు అతని ఫ్రెండ్ గొవిన్ చెప్పాడు. చోక్సీ కిడ్నాప్ అంతా ఉత్త డ్రామా అని ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వెల్లడించినట్లు న్యూస్ 18 కథనం స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగింది?
గత నెల 23న చోక్సీ.. ఆంటిగ్వా నుంచి కనిపించకుండా పోయాడు. 2018లో ఢిల్లీ నుంచి పారిపోయినప్పటి నుంచీ అతడు అక్కడే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతన్ని పక్క దేశం డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ అరెస్ట్ చేశారు. ఆంటిగ్వాలోని జాలీ హార్బర్ నుంచి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని, ఆ తర్వాత ఓ బోట్లో డొమినికాకు తీసుకెళ్లారని అతని లాయర్లు ఆరోపించారు.
ఆ గాయాలూ నాటకమేనా?
ఒంటిపై గాయాలున్నంత మాత్రాన చట్టపరంగా తన కిడ్నాప్ను అతడు నిరూపించలేడని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అసలు విషయాన్ని దాచి పెట్టడానికి ఈ కిడ్నాప్ డ్రామా ఆడారాని, కానీ ఇండియన్ మీడియాలో మాత్రం చోక్సీ తరఫు లాయర్లు చెప్పిన కథనాలే వస్తున్నాయని అటు ఆంటిగ్వా ప్రభుత్వ వర్గాలు కూడా అంటున్నాయి. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పాయి. అతడు ఆంటిగ్వా నుంచి మాయమైపోయిన సమయం, ఆ బోట్లు ఇక్కడి నుంచి వెళ్లిన సమయంలో తేడా ఉన్నదని.. దీనిపైనే విచారణ జరుగుతున్నట్లు చెప్పాయి. ఆంటిగ్వా ప్రధాని తనను ఇండియాకు అప్పగిస్తారన్న భయంతోనే చోక్సీ ఈ నాటకమాడినట్లు ఆంటిగ్వా ప్రభుత్వ వర్గాలు తేల్చిచెబుతున్నాయి.