కరోనా వ్యాప్తి కారణంగా సినిమా షూటింగ్లు నిలిచిపోవడంతో తమకు లభించిన విరామాన్ని ఇష్టమైన వ్యాపకాలతో సద్వినియోగం చేసుకుంటున్నారు సినీ తారలు. కొవిడ్ను ఎదుర్కోవడంలో సాయపడుతూ సామాజిక బాధ్యతను చాటుకుంటూనే మరోవైపు మనసుకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామంలో పంజాబీ సొగసరి పాయల్ రాజ్పుత్ తనలోని కొత్త కళను పరిచయం చేసింది. చిత్రకారిణిగా మారిన ఆమె ఓ అందమైన కాన్వాస్ పెయింటింగ్ వేసింది. పచ్చిక బయళ్లను, నీలాకాశాన్ని వర్ణరంజితంగా చిత్రించిన పాయల్ ఆ పెయింటింగ్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ‘చిత్రలేఖనంతో పరిచయం ఉన్నా ఇదివరకెప్పుడూ కాన్వాస్ పెయింటింగ్స్ వేయలేదు. ఇదే నా తొలి ప్రయత్నం. పికాసోలా నన్ను నేను ఊహించుకుంటూ ఈ పెయింటింగ్ వేశాను’ అని పాయల్ తెలిపింది. ఈ పెయింటింగ్ను ఉద్దేశిస్తూ చిత్రలేఖనంలో పాయల్రాజ్పుత్ ప్రావీణ్యం అద్భుతమంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగులో వెబ్సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె ఇటీవలే పంజాబీలో ఓ సినిమాను అంగీకరించింది.