న్యూఢిల్లీ: ప్రముఖ ఫుట్ డెలివరీ యాప్ ఈ కరోనా టైమ్లో ఓ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కొవిడ్-19 ఎమర్జెన్సీగా దానిని మార్క్ చేయవచ్చు. ఇలా మార్క్ చేసిన ఫుడ్ డెలివరీని జొమాటో వేగవంతం చేస్తుంది. ఆ ఆర్డర్కు ప్రాధాన్యత ఇచ్చి లొకేషన్, రూట్ ఆధారంగా అక్కడ ఉన్న వేగవంతమైన రైడర్కు ఈ డెలివరీని అప్పగిస్తుంది. పైగా ఈ ఆర్డర్ల కోసమే ప్రత్యేకంగా కస్టమర్ సపోర్ట్ను ఏర్పాటు చేశారు.
ఈ ఎమర్జెన్సీ ఆర్డర్లన్నీ కాంటాక్ట్లెస్వే. అంటే ముందుగానే పేమెంట్ చేసేయాలి. డెలివరీని మీ ఇంటి గుమ్మం ముందు ఉంచి వెళ్తారు. ఈ ఎమర్జెన్సీ ఆర్డర్లకు ఓకే చెప్పిన రెస్టారెంట్ల లిస్ట్ను యాప్లో అప్డేట్ చేశారు. ఆర్డర్ పేజీలో దిస్ ఆర్డర్ ఈజ్ రిలేటెడ్ టు ఎ కొవిడ్-19 ఎమర్జెన్సీ ఆప్షన్ను యూజర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటికి అదనపు ఛార్జీలను కూడా ఏమీ వసూలు చేయడం లేదు.
అయితే వీటిని దుర్వినియోగం మాత్రం చేయొద్దని జొమాటో కోరుతోంది. ఆర్డర్ తొందరగా వస్తుంది కదా అని అవసరం లేని వాళ్లు కూడా కొవిడ్ ఎమర్జెన్సీ ఆర్డర్ చేస్తే నిజంగా అవసరం ఉన్న వాళ్లకు అన్యాయం జరుగుతుందని ఆ సంస్థ చెబుతోంది. దీనినో అంబులెన్స్లాగా పరిగణించి, దుర్వినియోగం మాత్రం చేయొద్దు అని జొమాటో కోరింది.