న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: ఇండియాలో ఎంటర్టైన్మెంట్ మీడియా రంగంలో అతిపెద్ద విలీనం జరగనుంది. జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ ఇండియాలు విలీనమయ్యేందుకు ఆయా కంపెనీలు బోర్డులు సూత్రప్రాయ అనుమతిని తెలిపాయి. ఈ మేరకు ఇరు కంపెనీలూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తమ నెట్వర్క్స్, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ కార్యకలాపాలు, ప్రొగ్రామ్ లైబ్రెరీలను ఏకం చేయనున్నట్లు తెలిపాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గోయింకాయే విలీన సంస్థకు ఐదేళ్లపాటు సారధ్యం వహిస్తారు. రెండు ప్రధాన మీడియా నెట్వర్కింగ్ వ్యాపారాలు విలీనంకావడం ద్వారా చలనచిత్రాల నుంచి క్రీడల వరకూ వివిధ విభాగాల్లో వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ) తెలిపింది. విలీన నేపథ్యంలో ఎస్పీఎన్ఐ నగదు నిల్వలు 1.575 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 11,500 కోట్లు) చేరేలా మాతృసంస్థ అయిన సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వృద్ధి మూలధనాన్ని పెట్టుబడి చేస్తుంది.
జీ ఎంటర్టైన్మెంట్, ఎస్పీఎన్ఐల ప్రస్తుత ఈక్విటీ విలువల ప్రకారం విలీన కంపెనీలో జీఈఈఎల్ షేర్హోల్డర్లకు 61.25 శాతం వాటా వస్తుంది. అయితే ఎస్పీఎన్ఐలో మాతృసంస్థ పెట్టుబడిచేసే వృద్ధి మూలధనం కారణంగా జీఈఈఎల్ షేర్హోల్డర్ల వాటా 47.07 శాతానికి తగ్గి, ఎస్పీఎన్ఐ షేర్హోల్డర్ల వాటా 52.93 శాతానికి చేరుతుంది. ఫలితంగా విలీన కంపెనీలో మెజారిటీ వాటా సోనీ పిక్చర్స్ చేతిలో ఉంటుందని జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. జీ వ్యవస్థాపకుడు సుభాష్చంద్ర తనయుడు, జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుత ఎండీ పునీత్ గోయింకా విలీన కంపెనీకి నేతృత్వం వహిస్తారని జీ తెలిపింది. జీ ఎంటర్టైన్మెంట్లో ప్రధాన వాటా కలిగిన ఫండ్స్ ఇన్వెస్కో, ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్లు&గోయింకా పదవి నుంచి వైదొలగాలంటూ గతవారం కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఒత్తిడితెచ్చిన సంగతి తెలిసిందే. ఆ రెండు ఫండ్స్కు జీఈఈఎల్లో 17.88 శాతం వాటా ఉంది. విలీన కంపెనీ డైరెక్టర్ల బోర్డులో మెజారిటీ డైరెక్టర్లను సోనీ గ్రూప్ నామినేట్ చేసే హక్కు ఉంటుందని ఎస్పీఎన్ఐ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. విలీన వార్తల కారణంగా బుధవారం ఎన్ఎస్ఈలో జీ షేరు 31.5 శాతం లాభంతో రూ.336.8 వద్ద ముగిసింది.
రాకేశ్ ఝున్ఝున్వాలాకు వారంలో రూ.58 కోట్లు లాభం ప్రసిద్ద ఇన్వెస్టరు రాకేశ్ ఝున్ఝున్వాలా జీ షేరులో పెట్టుబడిచేసిన ఆరు రోజుల్లోనే భారీ లాభాన్ని సంపాదించారు. జీ ఎంటర్టైన్మెంట్లో మేనేజింగ్ డైరెక్టర్ గోయింకా తొలగింపుపై అంతర్జాతీయ ఫండ్స్ వివాదానికి తెరలేపిన సమయంలో ఝున్ఝున్వాలా గతవారం 50 లక్షల షేర్లను రూ.220 ధరతో కొన్నారు. ఇందుకోసం ఆయన రూ. 110 కోట్లు పెట్టుబడిచేశారు. బుధవారంనాటి ముగింపు ధర రూ.336.8 వద్ద ఆయన పెట్టుబడి రూ.168 కోట్లకు పెరిగింది. దీంతో ఆరు రోజుల్లోనే ఆయన రూ.58 కోట్ల లాభం ఆర్జించినట్లయ్యింది.