2015 నుంచి పర్యాటకుడిగా పలు దఫాలుగా ఇండియాకు రాక
2016 సెప్టెంబర్ నుంచి మూడేండ్ల పాటు ఢిల్లీలో మకాం
2020లో డీపోర్ట్ చేస్తే.. దొంగ పాసుపోర్టుతో మళ్లీ రాక
2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ రాక.. పత్రాలు నకిలీవని తేల్చి కేసు నమోదు చేసిన ఇమిగ్రేషన్ అధికారులు
45 రోజులు విచారణ జరిపి శుక్రవారం స్వదేశానికి పంపిన సైబరాబాద్ పోలీసులు
మూడేండ్లుగా ఢిల్లీలోనే అక్రమంగా తలదాచుని ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఓ ఆఫ్ఘన్ మాజీ సైనికుడిపై విచారణ జరిపి సైబరాబాద్ పోలీసులు శుక్రవారం స్వదేశానికి పంపించారు. కాగా.. అతను ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడలేదని, కేవలం పొట్ట పోసుకోవడం కోసమే భారత్కు వచ్చాడని రూఢీ అయ్యింది. ఎప్పటికైనా తాను ఇండియాలోనే స్థిరపడాలన్నది తన ఆశయంగా ఆ పౌరుడు చెప్పడం ఆసక్తికరంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని కాబూల్ ప్రావిన్స్ పాగమన్ జిల్లా కాల్దారే గ్రామానికి చెందిన ఇబ్రహీం ఖిల్ మహమ్మద్ షఫీఉల్లా 2015 ముందు వరకు కొన్నాళ్ల పాటు అక్కడి ఆర్మీలో ఉద్యోగం చేశాడు. హమీద్ కర్జాయ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఏర్పడ్డ కొత్త ప్రభుత్వంలో ఆర్మీ అధికారులకు తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో, పరిహారాలు చెల్లించకపోవడంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత అక్కడే ఓ సెలూన్ షాపు ప్రారంభించాడు. షఫీ ఉల్లాకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కాగా సెలూన్ దుకాణంతో అంతగా ఆదాయం రాకపోవడంతో భారతదేశానికి వచ్చి ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నాడు.
ఇంకో పాసుపోర్టు.. ఢిల్లీలో ఆధార్ కార్డు
ఈ సారి షఫీ ఉల్లా తన ప్రణాళికను మార్చాడు. పాత పాసుపోర్టు కాకుండా మారుపేరుతో ఆఫ్ఘన్లో కొత్త పాసుపోర్టు సంపాదించాడు. 2016 సెప్టెంబర్లో కొత్త పాసుపోర్టుతో ఇండియాకు వచ్చాడు. అప్పుడు తనకు పరిచయమైన వినోద్ కన్నాతో కలిసి స్థానిక తాత్కాలిక ఆధార్ కార్డును తీసుకున్నాడు. (ఆధార్ చట్టం ప్రకారం..ఆరు నెలలకు పైగా మన దేశంలో ఉండే విదేశస్తులకు పాసుపోర్టు నంబర్తో, అతను ఉండే తాత్కాలిక నివాస వివరాలను పొందుపరిచి తాత్కాలిక ఆధార్ కార్డు పొందవచ్చు. ఆ ఆధార్ కార్డుపై అతని పాస్పోర్టు నంబరే ఆధార్ కార్డు నంబర్గా ఉంటుంది.) ఆ తర్వాత స్పా నిర్వహిస్తూ 3 ఏండ్ల పాటు ఢిల్లీలోనే తలదాచుకున్నాడు. అతను ఇంకా ఇక్కడే ఉంటున్నట్టు 2020 ఫిబ్రవరి 2న గుర్తించిన ఢిల్లీ పోలీసులు షఫీ ఉల్లాను మళ్లీ స్వదేశానికి పంపించివేశారు. డీపోర్టు ప్రక్రియలో భాగంగా పాసుపోర్టు పై ‘ఇల్లీగల్ ఎంట్రీ’ అని ముద్ర వేసి పంపించివేశారు.
మళ్లీ.. కొత్త పాసుపోర్టు
తిరిగి భారతదేశానికి వచ్చేందుకు షఫీ ఉల్లా 2021 ఫిబ్రవరిలో పేరు మార్చి షఫీ పేరుతో కొత్త పాసుపోర్టు పొందాడు. ఈ సారి ఢిల్లీకి వెళ్లకుండా షార్జా నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నాడు. ఫిబ్రవరి 2న శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న షఫీని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. లగేజీ తనిఖీ చేయగా ఆఫ్ఘన్ పాసుపోర్టుతో పాటు ఇండియన్ ఆధార్ కార్డు కూడా దొరకడంతో అధికారులు అవాక్కయ్యారు. అన్నీ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో షఫీ ఉల్లాను సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు.
నేను ఇక్కడే ఉండిపోతా..
షఫీ ఉల్లా వీసా వ్యవహారంపై సైబరాబాద్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాద కోణంలో ముందు విచారణ జరిపారు. అయితే షఫీ ఉల్లా కేవలం ఉపాధి కోసమే భారత్కు వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. అతని వల్ల దేశ సమగ్రతకు ఎలాంటి భంగమూ వాటిల్లలేదని నిర్ధారించుకున్నారు. స్వదేశంలో ఆర్థికంగా దిగజారిపోయినందున భారతదేశంలో ఏదైనా ఉద్యోగం చేసుకొని బతికేందుకే వచ్చానని చెప్పుకొచ్చాడు. ఎన్నిసార్లు తనను డీపోర్టు చేసినా తిరిగి తాను ఇండియాకే వచ్చి బతకాలన్నదే తన ధ్యేయమని చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం నాడు నిబంధనల మేరకు సైబరాబాద్ పోలీసులు షఫీ ఉల్లాను ఆఫ్ఘన్కు పంపారు.
విజిటింగ్ వీసాతో వచ్చి..వెళ్తూ..
విజిటింగ్ వీసాపై ప్రతి రెండు నెలలకోసారి షఫీ ఉల్లా ఆఫ్ఘన్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఉండేవాడు. ప్రతిసారి ఏదో ఒక కొత్త కారణం చూపించి వీసా పొందేవాడు. 2015 మే-జూన్ నెలలో తొలిసారిగా టూరిస్టు వీసాపై ఢిల్లీకి చేరుకొని అక్కడ తన మిత్రుడు ఖాలిద్తో ‘లీ మిడా బ్యూటీ స్పా’ను ఏర్పాటు చేశాడు. వీసా గడువు ముగియడంతో 2015 జూలైలో స్వదేశానికి వెళ్లి అదే నెల 27న తిరిగి ఢిల్లీ వచ్చాడు. విజిటింగ్ వీసా గడువు ముగియడంతో అదే ఏడాది సెప్టెంబర్ 17న ఆఫ్ఘన్కు వెళ్లిపోయాడు. తిరిగి సెప్టెంబర్ 30న ఆరోగ్య కారణాలు చూయించి మెడికల్ వీసా తీసుకొని ఢిల్లీకి వచ్చాడు. అయితే ఏడాది దాటినా ఇంకా ఇక్కడే ఉండిపోవడంతో 2016 ఆగస్టులో పోలీసులు అతనిని గుర్తించి డీపోర్టు ప్రక్రియ ద్వారా స్వదేశానికి పంపించివేశారు.