కిలో 270కి పైనే విక్రయం
కొన్ని చోట్ల 300కు పైగా..
ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే కారణం
కరీంనగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో 60 లక్షల కోళ్లను నిల్వ చేసే సామర్థ్యంగల పౌల్ట్రీలు ఉన్నాయి. ఇందులో ప్రతి నెలా 10 లక్షల నుంచి 12 లక్షల కోళ్లు విక్రయిస్తుంటారు. నెల రోజుల కిందటి వరకు ఇదే పరిస్థితి కనిపించేది. కానీ, ఇప్పుడలా లేదు. వేసవి ప్రారంభం కావడంతో వేసిన కోళ్లలో 10 నుంచి 15 శాతం మృత్యువాత పడుతున్నాయి. దీనికి తోడు నెల కింద 16,500 టన్ను ఉన్న ఫీడ్ ఇప్పుడు 22,500కు చేరింది. వ్యాక్సిన్ ధరలు కూడా నెలకు ఇప్పటికీ 40 శాతం పెరిగాయి. కోడి పిల్లల ధరలు కూడా నెల కింద 25 నుంచి 30 మాత్రమే ఉండగా, ఇప్పుడు 50 నుంచి 60 వరకు పెరిగింది. దీంతో ఫౌల్ట్రీ రైతులపై తీవ్ర ప్రభావం పడింది. లేయర్ కోళ్లను పెంచాలంటేనే రైతులు జంకుతున్నారు. ప్రతి నెలా రావాల్సిన 10 లక్షల నుంచి 12 లక్షల కోళ్లలో కనీసం 5 లక్షల నుంచి 6 లక్షలు కూడా రావడం లేదు. ఆంధ్రా, మహారాష్ట్ర నుంచి వచ్చే కోళ్లు తగ్గిపోయాయి. దీంతో చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి.
సామాన్యులు కొనలేని పరిస్థితి..
వారం కింద 240కి కిలో వచ్చిన స్కిన్ లెస్ చికెన్ ఇప్పుడు 270 నుంచి రూ.300 వరకు పెరిగింది. దీంతో సామాన్యులు, మధ్య తరగతి వినియోగదారులు కొనలేని పరిస్థితి వచ్చింది. చికెన్ చౌకగా ఉన్నప్పుడు కిలో తీసుకెళ్లిన వినియోగదారులు ఇప్పుడు అర కిలో కొందామంటే భయపడుతున్నారు. కరీంనగర్లో 170కిపైగా చికెన్ సెంటర్లు ఉండగా, ఇందులో కొన్ని పెద్ద సెంటర్లు మాత్రమే ఇప్పుడు నడుస్తున్నాయి. గిరాకీ ఉండక పోవడంతో చిన్న సెంటర్లను తెరవడం లేదు. తెరిచినా గతంలోలాగా పొద్దంతా ఉండడం లేదు. రోజులో ఏ గంటో, రెండు గంటలో తెరుస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు మాంసకృత్తులు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మటన్ కంటే చౌకగా లభించే చికెన్ పైపే వినియోగదారులు ఎక్కువ మొగ్గు చూపగా, ఇప్పుడు దీని ధర కూడా చుక్కలు చూపుతుండడంతో సామాన్య, మధ్య తరగతి వినియోగదారులకు చికెన్ భారంగా మారుతున్నది.
ఎటు చూసినా గడ్డు కాలమే..
ప్రస్తుత పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులు కోళ్లను పెద్ద మొత్తంలో పెంచే పరిస్థితిలో లేరు. తాము నష్టాల ఊబిలో చిక్కుకున్నామని వాపోతున్నారు. కోడి పిల్లల ధర నుంచి అన్నీ పెరిగి పోయాయని, దీనికి తోడు ఎండకాలం ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 60 లక్షల కోళ్లు పెంచే సామర్థ్యంగల పౌల్ట్రీ ఫామ్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం కూడా పెంచే పరిస్థితి కనిపించడం లేదు. ఒక పక్క పెరుగుతున్న ఫీడ్, వ్యాక్సిన్ ధరలు, మరో పక్క వేసవి తాపాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్న కోళ్లను చూసి రైతులు ధైర్యం చెడుతున్నారు. పెంచడం, నష్టపోవడం దేనికని ఆలోచిస్తున్నారు. ఇదే పరిస్థితి మిగతా ప్రాంతాల్లోనూ కనిపిస్తుండడంతో చికెన్ ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇటు వినియోగదారులు కూడా ధరలు ఇలా ఉంటే కొనలేమని, తినలేమని వాపోతున్నారు.
ఇవి కూడా చదవండి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరిన ముగ్గురు వ్యోమగాములు
నాలుగు పోలింగ్ బూత్లలో 20న రీ పోలింగ్: ఈసీ ఆదేశం