న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో భారత్ లో రికవరీ ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును 8.3 శాతానికి తగ్గించిన వరల్డ్ బ్యాంక్ 2023లో జీడీపీ 7.5 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లపై కొవిడ్-19 ప్రభావంతో పాటు వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లడంతో వృద్ధి రేటు మందగిస్తుందని వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది.
ఉద్యోగాలు, ఆదాయ అవకాశాలపై అనిశ్చితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి భారత్ లో వినిమయం, పెట్టుబడి అవకాశాలను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఇక భారత్ లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మౌలిక రంగంపై వెచ్చించడం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య మౌలిక వసతులపై ఖర్చు చేయడం, సేవా రంగంలో రికవరీతో ఆర్థిక వ్యవస్థ 8.3 శాతం పెరుగుతుందని వరల్డ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది.