న్యూఢిల్లీ, మే 27: చౌక స్మార్ట్ఫోన్ను అందుబాటులో తెచ్చేందుకు తమ భాగస్వామ్య సంస్థ జియోతో కలిసి పనిచేస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే ఎంట్రీలెవల్, చౌకైన స్మార్ట్ఫోన్ను అభివృద్ధిపర్చేందుకు ఇరు కంపెనీలు ఒక వాణిజ్య ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నాయి. ఆసియాపసిఫిక్ దేశాలకు చెందిన మీడియావారితో సుందర్ పిచాయ్ గురువారం మాట్లాడుతూ.. చౌక ఫోన్ ప్రాజెక్టులో ప్రగతిని సాధించేందుకు తాము కట్టుబడి వున్నామన్నారు. అయితే ఫోన్ ఎప్పుడు విడుదల చేసేది, దాని ధర తదితర వివరాలను పిచాయ్ వెల్లడించలేదు. చౌక మొబైల్ హ్యాండ్సెట్లు, తక్కువ మొబైల్ డాటా ధరల ద్వారా దేశంలో ఇంటర్నెట్ను మరింత మందికి చేర్చడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు.