న్యూఢిల్లీ, అక్టోబర్ 13: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు నికర లాభంలో 17 శాతం వృద్ధిని కనబరిచింది. 2020-21లో రూ. 2,484.40 కోట్లుగా ఉన్న కన్సాలిడేటెడ్ నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.2,930.60 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 30 శాతం ఎగబాకి రూ.19,667.40 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.15,114.50 కోట్లుగా ఉన్నది.
వార్షిక ఆదాయం 10 బిలియన్ డాలర్లు(రూ.75,300 కోట్లు)గా నమోదైంది.
సంస్థకు వచ్చిన మొత్తం ఆదాయంలో ఐటీ సేవలు అందించడంతో రూ.19,378.38 కోట్లు లభించాయి.
ప్రస్తుత త్రైమాసికంలో రూ.19,500 కోట్ల నుంచి రూ.19,889 కోట్ల స్థాయిలో ఆదాయం రావచ్చునని సంస్థ అంచనావేస్తున్నది.
బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, బీమా రంగాల వాటా 34.8 శాతంగా ఉండగా..కన్జ్యూమర్ వర్టికల్ 17.3 శాతం, ఎనర్జీ వర్టికల్ 12.3 శాతం, టెక్నాలజీ 12.2 శాతం, హెల్త్ 11.7 శాతం, తయారీ 6.7 శాతం, కమ్యూనికేషన్స్ రంగాల వాటా 5 శాతంగా ఉన్నది.
కంపెనీ ఇప్పటి వరకు 27 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా, వీటిలో 8 బిలియన్ డాలర్లు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం నుంచి వచ్చాయి.
గత త్రైమాసికంలో 8,100 మంది ఫ్రెషర్లను నియమించుకున్నది. ఈ ఏడాదిలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నది.
‘వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే క్యూ2లో రాణించాం. తొలి త్రైమాసికంతో పోలిస్తే ఆ తర్వాతి క్వార్టర్లో 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగలిగాం. కస్టమర్లు, భాగస్వాముల వల్లనే ఒక్క ఏడాదిలోనే 10 బిలియన్ డాలర్ల ఆదాయం
మైలురాయిని చేరుకోగలిగాం’