న్యూఢిల్లీ, జూన్ 18: ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఉద్యోగులకు బొనాంజా లభించింది. ఈ ఏడాది రెండోదఫా జీతాల పెంపును పొందబోతున్నారు. జూనియర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు విప్రో శుక్రవారం ప్రకటించింది. బ్యాండ్ బీ3 ఉద్యోగులకు (అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆ దిగువస్థాయి) పెంచబోతున్న జీతాలు సెప్టెంబర్ 1నుంచి అమలవుతాయని విప్రో తెలిపింది. 2021 జనవరిలోనే ఈ బ్యాండ్లోని ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో వీరు 80 శాతం వున్నారు. విప్రో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.97 లక్షలు. ఇక సీ 1 బ్యాండ్ ఉద్యోగులకు (మేనేజర్, ఆ పైస్థాయి) గతంలో ప్రకటించినట్లుగానే ఈ జూన్లో వేతన పెంపు వుంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ఎంతమేరకు పెంచేదీ వెల్లడించలేదు. ప్రతీ ఏటా సాధారణంగా జూన్లో ఈ కంపెనీ ఉద్యోగులకు వేతన పెంపు వుంటుంది. బీ3 బ్యాండ్ వరకూ మంచి పనితీరు కనపర్చినవారికి 2020 డిసెంబర్లో కంపెనీ ప్రమోషన్లు కూడా ఇచ్చింది.