వాషింగ్టన్ : భారత్ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నామని, ఈ మేరకు విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని బిడెన్ పరిపాలన హామీ ఇచ్చింది. వ్యాక్సిన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాల ఎగుమతిపై విధించిన ఆంక్షలు సడలించే విషయమై అగ్రరాజ్యం అమెరికా నుంచి స్పష్టమైన హామీ రాలేదు. కానీ, భారత విన్నపాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని చెప్పింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వ్యాక్సిన్ సంస్థలతో పాటు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై స్పందించింది.
భారత ఔషధరంగం అవసరాలను అర్థం చేసుకున్నామని.. వీటిపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. అమెరికాలో దేశీయ సంస్థలకు ప్రయోజనం కల్పించేందుకు ఢిపెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ను అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమలులోకి తేవడంతో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. జూలై 4వ నాటికి మొత్తం జనాభాకు టీకాలు వేసే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఫైజర్, మోడెర్నా కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తిని వేగవంతం చేసేలా అమెరికా చర్యలు చేపట్టింది. దీంతో ముడి పదార్థాల ఎగుమతికి ఆటంకం కలుగుతోంది.
అమెరికా నిర్ణయంతో ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న భారత కంపెనీలపై పడింది. ముఖ్యంగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ అదర్ పునావాలా సైతం వ్యాక్సిన్ తయారీకి వినియోగించే ముడి సరుకులపై నిషేధం ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు, మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంక్షలు ఎత్తి వేయాలని కోరారు. ఈ విషయాన్ని ఇటీవల అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు సైతం బైడెన్ పరిపాలన దృష్టికి తీసుకెళ్లారు.
భారత్లో కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి ముడి సరుకును సజావుగా సరఫరా చేసేలా చూడాలని కోరారు. అన్నిరకాలుగా వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా స్పందించింది. వ్యాక్సిన్ ముడిపదార్థాలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టంచేసింది. కేవలం అమెరికా ఫార్మా కంపెనీలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయని తెలిపింది. భారత్ విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకొని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.