గోల్డ్ మానిటైజేషన్ స్కీం
రువాలో నిరుపయోగంగా పడివున్న ఆభరణాలను రిజర్వ్ బ్యాంకు దగ్గర డిపాజిట్ చేస్తే ఏటా రెండున్నర శాతం వడ్డీ ఇచ్చేలా రూపొందించినదే గోల్డ్ మానిటైజేషన్ స్కీం (పసిడి నగదీకరణ పథకం). ఈ స్కీం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లాంటిదే అని ప్రభుత్వం చెప్పినా అందుకు స్పందన కరువైంది. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీంలో ఆభరణాలు, నాణేలు ఇతర రూపాల్లో డిపాజిట్ చేయవచ్చు.
మీరు మదుపరేనా?
బంగారాన్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసమే కొనుగోలు చేసేవారికి ఈ స్కీం ఉపయోగపడుతుంది. స్వల్పకాలంలో ధరల్లో ఒడిదుడుకులున్నప్పటికీ.. దీర్ఘకాలంలో బంగారం ధర మాత్రం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని బ్యాంకు లాకర్లలో దాచుకోవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. పైగా బీరువాలో భద్రత కరువు. ఎక్కడ దాచినా దానికి ఇన్సూరెన్స్ ఉండదు. కనుక ఈ స్కీంలో దాచుకోవడం వల్ల భద్రతతోపాటు వడ్డీ ఆదాయం అదనపు ఆకర్షణ.
డిపాజిట్ చేస్తే జరిగేది ఏంటి?
వివిధ రూపాల్లోని బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని ప్యూరిటీని పరిశీలిస్తారు. వినియోగదారు అంగీకరిస్తే దాన్ని వెంటనే కరిగించి బంగారు నాణేలుగా మార్చుతారు. బంగారు గాజులు, నెక్లేస్ వంటి నగలు డిపాజిట్ చేసినా అవి మళ్లీ మన చేతికి నాణేలుగానే వస్తాయి. గోల్డ్ మానిటైజేషన్ స్కీం విఫలం కావడానికి ఇదొక ప్రధాన కారణం. బీరువాలో బంగారం అత్యవసర సమయాల్లో ఎప్పుడంటే అప్పుడు అమ్ముకునే వీలుండటం వల్ల ఆర్థిక భరోసా కలిగిస్తుందనేది భారతీయుల సంప్రదాయ ఆలోచన. బంగారం అమ్మాలంటే కేవైసీ ప్రక్రియ అక్కర్లేదు. కొన్నేండ్లుగా కూడబెట్టుకున్న బంగారు ఆభరణాలను నాణేలుగా మార్చి, తరుగుతో నష్టపోయి మానిటైజేషన్కు ఇవ్వాలన్న ఆలోచనే ఓ పెద్ద తప్పిదం అనే అభిప్రాయంలో భారతీయులు ఉండటం కూడా స్కీం విఫలానికి మరో కారణం. దీనికితోడు స్కీంపై అవగాహన కూడా చాలామందిలో తక్కువ. నిజానికి బంగారాన్ని డిపాజిట్ చేస్తున్నా దాని మీద వచ్చే వడ్డీని నగదు రూపంలోనే గణిస్తారు. అంటే వడ్డీ ద్వారా వచ్చే అదనపు రాబడిని నగదులోనే ఇస్తారు. కానీ బంగారం రూపంలో కాదు.
వడ్డీ ఎంత?
గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో ఏడాది నుంచి ఏడేండ్ల కాలపరిమితి వరకు బంగారాన్ని డిపాజిట్ చేయవచ్చు. ఏడాది కాలపరిమితికి 0.50 శాతం, రెండేండ్ల లోపు 0.55 శాతం, రెండు నుంచి మూడేండ్ల వరకు 0.60 శాతం వడ్డీ లభిస్తుంది. మూడు నుంచి ఐదేండ్లయితే 2.25 శాతం వడ్డీ ఆదాయం వస్తుంది. అదే 5 నుంచి 7 ఏండ్ల కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. స్కీం కాలపరిమితి తీరిన తర్వాత బంగారం కావాలంటే బంగారం.. లేదంటే అంతకు సమానంగా నగదు ఇస్తారు. అయితే 0.20 శాతం ఛార్జీలు వర్తిస్తాయి. ఎస్బీఐతోసహా అన్ని ప్రధాన బ్యాంకులు ఈ స్కీంను అందిస్తున్నాయి. ఇక ఈ స్కీం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై ఆదాయం పన్ను, ఆస్తి పన్ను లాంటివి మినహాయింపు ఉండడం ప్రత్యేకం.