న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించబోబని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అలాగే ప్రైవేటీకరించే బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది హక్కులను కాపాడుతామని తెలిపారు. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొన్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి సమర్థించుకున్నారు. అయితే, వాటిల్లో పని చేస్తున్న సిబ్బంది వేతనాలు, పెన్షన్లను పరిరక్షిస్తామని తెలిపారు.
వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఆధ్వర్యంలో దాదాపు 10 లక్షల మంది సిబ్బంది రెండు రోజులుగా సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకింగ్ సేవలకు పాక్షికంగా అంతరాయం ఏర్పడింది.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును ప్రైవేటీకరిస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీ ఆరోపణలను నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. యూపీఏ హయాంలో పన్ను చెల్లింపుదారుల మొత్తాన్ని ఒక కుటుంబానికి ఉపయోగించారని ఎదురుదాడికి దిగారు. క్రోనీ క్యాపిటలిస్టుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నారని, దేశ ఆర్థిక భద్రతతో కేంద్రం రాజీ పడుతున్నదని అంతకుముందు రాహుల్గాంధీ ఆరోపణలు గుప్పించారు.