హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ, ఏపీల్లో తమ హైస్పీడ్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. తమ 900 మెగాహెర్జ్ బ్యాండ్లో ప్రస్తుత స్పెక్ట్రమ్కు అదనపు స్పెక్ట్రమ్ చేర్చామని, దీంతో ఇన్డోర్ నెట్వర్క్ కవరేజ్ పెరుగుతుందన్నది. అలాగే 10,000 మొబైల్ సైట్ల 4జీ కవరేజిని పెంచినట్లు సంస్థ సీఈవో అవ్నీత్ సింగ్ పురి తెలిపారు. దీంతో హైవేలు, రైల్వే మార్గాల్లో కవరేజ్ విస్త్రతంగా వుంటుందని, గ్రామా ల్లో మరింతమంది హైస్పీడ్ డేటా సర్వీసుల్ని అందుకోగలుగుతారని వివరించారు. ఎయిర్టెల్ ఇటీవలే హైదరాబాద్లో 5జీ లైవ్ సర్వీసుల్ని ప్రదర్శించిన సంగతిని ఆయన గుర్తుచేస్తూ, కొత్త నెట్వర్క్ టెక్నాలజీలను ప్రవేశపెట్టేందుకు మరిన్ని పెట్టుబడులు చేస్తామని తెలిపారు.
శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్వెబ్లో మరో రూ.3,700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు భారతీ గ్రూప్ తెలిపింది. దివాలా ప్రక్రియలో వున్న వన్వెబ్ను గతేడాది బ్రిటన్ ప్రభుత్వం, భారతీ గ్రూప్ కలిసి గట్టెక్కించాయి. తాజా పెట్టుబడులతో వన్వెబ్లో 38.6 శాతం వాటాతో భారతీ అతిపెద్ద వాటాదారు అవుతుంది. బ్రిటన్ ప్రభుత్వం, ఈయూటెలిశాట్, సాఫ్ట్బ్యాంక్లకు ఒక్కోదానికి 19.3 శాతం చొప్పున వాటాలుంటాయి