Air India-Tata | అప్పుల ఊబిలో చిక్కుకున్న కేంద్ర పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టేకోవర్ చేయనున్న టాటా సన్స్ను దాని నిర్వహణ అంత తేలిక కాదని కేంద్ర డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తేల్చి చెప్పారు.
ఎయిర్ ఇండియాను కారు చౌకగా టాటాలకు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టాటా సన్స్కు ఎయిర్ ఇండియా కామధేనువేమీ కాదని పేర్కొన్నారు. కొత్త యజమానికి సంస్థను నడపడం అంత సులువేమీ కాదన్నారు. విమాన సర్వీసుల పునరుద్ధరణకు టాటా సన్స్ భారీగా పెట్టుబడులు ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు.
ఎయిర్ఇండియా నిర్వహణ అంత సులువేమీ కాదు.. సంస్థకు ఏండ్లతరబడిగా ఉన్న అప్పులను టాటా సన్స్ తీసుకోవడం లేదు. కేవలం టాటా సన్స్ భరించగల అప్పులే తీసుకున్నారు. ఎయిర్ ఇండియా విక్రయం వల్ల పన్ను చెల్లింపుదారుల సొమ్ము భారీగా ఆదా అయ్యిందని తుహిన్ కాంత్ పాండే సెలవిచ్చారు. ఎయిర్ ఇండియా నిర్వహణకు ప్రతి రోజూ రూ.20 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నదన్నారు. వీలైనంత త్వరగా టాటా సన్స్కు ఎయిర్ ఇండియాను అప్పగిస్తామని తెలిపారు.