ఏళ్లనాటి సమస్యలకు సత్వర పరిష్కారం
రాయపర్తి విలేజ్పార్కు జిల్లాకే ఆదర్శం
కలెక్టర్ ముండ్రాతి హరిత
రాయపర్తి, జూలై 1: రాష్ట్రంలోని పల్లెలు, మారుమూల గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదని కలెక్టర్ ముండ్రాతి హరిత అన్నారు. మండలకేంద్రంలోని జీపీ కార్యాలయ ఆవరణలో గురువారం సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి పల్లెప్రగతి కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తున్నదన్నారు. 60 ఏళ్లుగా గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలన్నీ ఈ కార్యక్రమం ద్వారా పరిష్కారం అవుతున్నట్లు తెలిపారు. గ్రామసభలకు పంచాయతీ పాలకవర్గ సభ్యులతోపాటు ప్రజలు హాజరై తమ వార్డులు, కాలనీలు, ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభ దృష్టికి తేవాలన్నారు. పాలకుర్తి-అన్నారం షరీఫ్ రోడ్డు విస్తరణలో భాగంగా జీపీ భవనంలో కొంతభాగాన్ని కూల్చాల్సి వచ్చిందని, బాలికల పాఠశాల భవనాన్ని జీపీకి కేటాయించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆకుల సురేందర్రావు కలెక్టర్ను కోరగా, విద్యా శాఖ అధికారులతో మాట్లాడుతానన్నారు.
రాయపర్తికి రూ. 16 లక్షలు కేటాయింపు
మండలకేంద్రం అభివృద్ధికి కలెక్టర్ భారీ నజరానా ప్రకటించారు. పాలకుర్తి-అన్నారం షరీఫ్ గ్రామ రోడ్డు విస్తరణ కారణంగా విద్యుత్ స్తంభాల తొలగింపు కోసం రూ. 16 లక్షలు కేటాయిస్తున్నట్లు హరిత తెలిపారు. అనంతరం ఆమె విలేజ్పార్కు, నర్సరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి మొక్కలు నాటారు. జిల్లాలోనే రాయపర్తి పల్లెప్రకృతి వనం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. అలాగే, మండలకేంద్రంలోని జడ్పీఎస్ఎస్ను కలెక్టర్ తనిఖీ చేసి పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో మిట్టపల్లి సంపత్రావు, ఆర్డీవో మహేందర్జీ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్, మండల ప్రత్యేకాధికారి నరేశ్కుమార్నాయుడు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో కలికోట రామ్మోహనచారి, ఎంపీవో తుల రామ్మోహన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, విద్యుత్ ఏఈ రాజశేఖర్, నేతావత్ కిషన్నాయక్, ఎండీ నయీం, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, కార్యదర్శి అశోక్నాయక్, కారోబార్ రాంచంద్రయ్య పాల్గొన్నారు.