కోర్టు చౌరస్తా, జూలై 10: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ను అన్ని కోర్టుల్లో నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని న్యాయసేవా సదన్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, కొవిడ్ లాక్డౌన్ల వల్ల కేసుల సంఖ్య పెరిగిందని, వాటిని తగ్గించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఈ లోక్ అదాలత్పై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. లోక్ అదాలత్కు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా జడ్జి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎస్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కుటుంబాల మధ్య సివిల్ తగాదాలు ఎక్కువగా ఉంటాయని, వాటిని మంచి వాతావరణంలో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. అదనపు జిల్లా జడ్జిలు కృష్ణమూర్తి, లలితా శివజ్యోతి, మాధవికృష్ణ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘునందన్రావు, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్ మాట్లాడారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులు, బ్యాంకు, ఆర్టీసీ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కేసుల పరిష్కారంలో జిల్లాకు ఐదో స్థానం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 5645 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. వీటిలో క్రిమినల్ 5457, సివిల్ 75, రాజీ చేయదగిన కేసులు 113 పరిష్కరించినట్లు తెలిపారు. వీటిలోనే మోటారు ప్రమాదాల కేసులు 43 పరిష్కరించగా వాటిలో బాధితులకు రూ.2 కోట్ల 29 లక్షల 70వేలు అందనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసుల పరిష్కారంలో ఉమ్మడి జిల్లాకు 5వ స్థానం లభించినట్లు జడ్జి పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి సత్వర న్యాయం
లోక్ అదాలత్లో ఓ బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందింది. వివరాలు ఇవి.. 2014 డిసెంబర్ 30న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రాంతంలో వ్యాన్ ఢీకొనడంతో హుస్సేనిపురకు చెందిన నజ్మాపర్విన్ అనే మహిళ మృతి చెందారు. పర్విన్ జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, ఆమె సంపాదనపైనే భర్త మహ్మద్ మీరజ్ (40), తల్లి సర్వారి బేగం (50) పూర్తిగా దివ్యాంగురాలైన చెల్లెలు కాజీమా ఆధారపడి జీవించేవారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం.. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్, ఓనర్, వాహనానికి ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీపై 82 లక్షల పరిహారం కోరుతూ కరీంనగర్ కోర్టులో 2017లో కేసు వేసింది. ఈ కేసు శనివారం లోక్ అదాలత్కు రాగా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు జడ్జి ఎదుట రాజీమార్గంలో పరిష్కరించుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.75 లక్షలు ఇచ్చేందుకు వారు ఒప్పుకోవడంతో తమకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ప్రియదర్శిని, శ్రీరాం ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తొందరగా న్యాయం జరిగింది
నేను దివ్యాంగురాలిని. మా అక్క పర్విన్పై ఆధారపడి జీవిస్తున్న. నాకు నా తల్లికి లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందింది. మా అక్క పర్విన్ ప్రభుత్వ ఉద్యోగం చేసేది. 2014 డిసెంబర్లో వ్యాన్ యాక్సిడెంట్లో చనిపోయింది. మా అక్క చనిపోవడంతో నేను నాతల్లి రోడ్డున పడ్డాం. 2017లో పరిహారం కేసు వేశాం. ఈ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ కాగా, 75 లక్షలు రూపాయలు శ్రీరాం ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించింది. మాకు సంతోషంగా ఉంది. జిల్లా జడ్జి మేడమ్ ప్రియదర్శిని గారికి కృతజ్ఞతలు.