ఎస్బీఐ కస్టమర్లకు సీజీఎం ఓం ప్రకాశ్ సూచన
హైదరాబాద్/న్యూఢిల్లీ ఏప్రిల్ 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు, లోన్ ప్రాసెసింగ్ విభాగాల్లో ఇటీవల పలువురు సిబ్బంది కొవిడ్-19 బారిన పడటంపై ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం ఓం ప్రకాశ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని నిరోధించేందుకు అన్ని శాఖల్లో పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని, శానిటైజర్లు, థర్మల్ స్కానర్ల వినియోగం లాంటి నిబంధనలు కట్టుదిట్టంగా అమలయ్యేలా చూడాలని కోరారు. ఆర్థిక లావాదేవీల కోసం కస్టమర్లు ఎస్బీఐ యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ వ్యవస్థలను విరివిగా ఉపయోగించుకోవాలని, మరీ అత్యవసరమైతేనే బ్యాంకుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కస్టమర్లకు సంబంధించిన ఇతర అవసరాలు, సందేహాలను తీర్చేందుకు తాత్కాలికంగా 040-23466233 హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేశామని, ఓం ప్రకాశ్ తెలిపారు.
సేవలపై పరిమితి విధించాలి..
కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలపై పరిమితి విధించాలని, పరిస్థితి చక్కబడే వరకు ప్రజా లావాదేవీల సమయాన్ని రోజులో 3 గంటలకు కుదించి ఉద్యోగులకు రక్షణ కల్పించాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి.