న్యూఢిల్లీ, జూలై 26: హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని పలు నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజయ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీకి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విజయ డయాగ్నస్టిక్ ఐపీవోలో తాజా ఈక్విటీల జారీ ఉండదు. కంపెనీ ప్రమోటరైన డాక్టర్ ఎస్ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇన్వెస్టింగ్ సంస్థలు కరకోరం లిమిటెడ్, కేదారా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లు ఈ ఐపీవో ద్వారా 35,688,064 షేర్లను విక్రయిస్తాయి. ఈ విక్రయంతో ప్రమోటరు, ప్రస్తుత షేర్హోల్డర్లు కంపెనీలో వారి వాటాను 35 శాతం మేర తగ్గించుకుంటారు. ఒక్క కేదారా క్యాపిటలే 30 శాతం వాటాను విక్రయిస్తుంది. ఈ సంస్థ 2016లో విజయ డయాగ్నస్టిక్లో 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. దక్షిణాదిన అతిపెద్ద డయాగ్నస్టిక్ చైన్లలో ఒకటైన విజయ డయాగ్నస్టిక్ సెంటర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కొల్కతా, ఢిల్లీ ఎన్సీఆర్లలోని 13 నగరాలు, పట్టణాల్లో పాథాలజీ, రేడియాలజీ టెస్టింగ్ సర్వీసుల్ని అందిస్తోంది.
మరికొన్ని కంపెనీలకూ అనుమతి…
ఐపీవోల జారీకి విజయ డయాగ్నస్టిక్తో పాటు మరో ఐదు కంపెనీలను అనుమతిస్తున్నట్లు సోమవారం సెబీ తెలిపింది. పూణేకు చెందిన మరో డయాగ్నస్టిక్ చైన్ క్రస్నా డయాగ్నస్టిక్స్, ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, కార్ట్రేడ్ టెక్, సుప్రియా లైఫ్సైన్సెస్, ఆమ్ని ఆర్గానిక్స్ ఐపీవోలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.