ముంబై: బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ హౌస్ను హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ కొనుగోలు చేసింది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రధాన కార్యాలయమైన ముంబై విలే పార్లేలోని కింగ్ఫిషర్ హౌస్ను రుణ రికవరీ ట్రిబ్యునల్ ఇటీవల 9వ సారి వేలం వేసింది. చివరకు హైదరాబాద్కు చెందిన శాటర్న్ రియల్టర్స్ రూ.52.25 కోట్లకు దీనిని కొనుగోలు చేసింది. ఈ డీల్ కోసం శాటర్న్ రియల్టర్స్ మహారాష్ట్ర ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా రూ.2.612 కోట్లు చెల్లించింది. జూలై 31న కింగ్ఫిషర్ హౌస్ కొనుగోలు ఒప్పందం జరిగింది.
ముంబై విమానాశ్రయం వెలుపల ఉన్న 2401.70 చదరపు మీటర్ల కింగ్ఫిషర్ హౌస్ ఆస్తి, 2016 నుంచి జప్తులో ఉన్నది. బెంగళూరుకు చెందిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ దీనిని తొలుత రూ.135 కోట్ల ప్రారంభ రిజర్వ ధర కింద విక్రయించడానికి చేసిన ఎనిమిది ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు 9వ సారి వేలంపాటలో హైదరాబాద్కు చెందిన శాటర్న్ రియల్టర్స్ రూ.52.25 కోట్లకు కింగ్ఫిషర్ హౌస్ను సొంతం చేసుకున్నది. కాగా, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012 అక్టోబర్ 20 నుంచి విమాన సేవలను నిలిపివేసింది.