బాకీలు వసూలు చేసుకోనున్న బ్యాంకులు
లండన్, జూలై 26: భారత్ బ్యాంకులకు పెద్ద ఊరట కల్గించే వార్త. బ్యాంకులకు టోపివేసి దేశం నుంచి పారిపోయిన వాణిజ్యవేత్త విజయ్ మాల్యా దివాలా తీసినట్లు యూకే హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కార్యకలాపాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల మేరకు బ్యాంకుల్ని మాల్య మోసగించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజా రూలింగ్తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం.. మాల్యాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తుల్ని జప్తుచేసి, రుణ బకాయిల్ని వసూలు చేసుకోగలుగుతుంది. తనను ఇండియాకు పంపించకూడదంటూ మాల్యా వేసిన పిటిషన్ తిరస్కరణ కు గురైందని, అలాగే యూకే సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకునే అనుమతి కూడా మాల్యా కు లభించలేదని, ఇండియాకు ఆయనను తీసుకొస్తామని ఇడీ తెలిపింది.
మాల్యా అరెస్టును కోరుతూ భారత్ బ్యాంకులు సుప్రీంకోర్టును ఆశ్రయించేముందుగానే ఆయ న దేశం విడిచిపారిపోయారు. అప్పట్నుంచి మాల్యాను ఇక్కడకు తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది.