నవాబ్పేట, మే9: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో హమాలీలు మూడు రోజుల నుంచి చేస్తున్న సమ్మెతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే…మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఎనిమిది రోజుల క్రితం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. కాగా గురువారం నుంచి హమాలీలు కూలీ పెంచాలని కోరుతూ సమ్మెకు దిగారు. సంచికి గతంలో ఇస్తున్న రూ.7కాకుండా..రూ.10 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హమాలీలు లోడింగ్, అన్లోడింగ్ను నిలిపివేశారు. దీంతో అన్నదాతలు మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆదివారం మార్కెట్ చైర్మన్ డీఎన్రావ్, కార్యదర్శి శివశంకర్రెడ్డి హమాలీ సంఘం నాయకులతో చర్చలు జరిపినప్పటికీ సఫలం కాలేదు. మార్కెట్కు ధాన్యం తెచ్చిన రైతులు మాత్రం..విక్రయించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు మాత్రం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని రైతులు వాపోతున్నారు.