Cyrus on Covishied exports Ban | కరోనా మహమ్మారి నియంత్రణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిపై సీరం ఇన్స్ట్యిటూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) చైర్మన్ సైరస్ పూనావాల సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాలకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం చాలా చెడు నిర్ణయం అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ సంస్థగా సీరంను కేంద్రం నిర్ణయం ఇబ్బందుల్లోకి నెట్టేసిందని వ్యాఖ్యానించారు.
శుక్రవారం ప్రతిష్ఠాత్మక లోక్మాన్య అవార్డు తీసుకున్న సైరస్ పూనావాలా మీడియాతో మాట్లాడారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం చాలా చెడు నిర్ణయం అన్నారు. తన కొడుకు, సంస్థ సీఈవో అదార్ పూనావాలా ఈ విషయమై నోరు మెదపొద్దన్నాడని, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఎగుమతులను అనుమతించాల్సిందేనన్నారు.
సీరం ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్పై ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఆధారపడి ఉన్నాయి. కీలక సమయంలో వ్యాక్సిన్ల సరఫరాను నిలిపివేసిందని ఆయా దేశాల ప్రభుత్వాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ దేశాలన్నీ ముందస్తుగానే వ్యాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్కు రూ.కోట్లలో అడ్వాన్స్ చెల్లించాయి.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కలిపి రూ.5000 కోట్లు ఇచ్చాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, డబ్ల్యూహెచ్వోలకు డబ్బు వెనక్కు ఇచ్చేందుకు సిద్ధ పడినట్లు సైరస్ పూనావాలా చెప్పారు. కానీ ఆ సంస్థలు తన ప్రతిపాదనను నిరాకరించాయన్నారు. త్వరలో కొవిషీల్డ్ ఎగుమతిపై కేంద్రం నిషేధం ఎత్తివేస్తుందని ఆ సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయన్నారు.