హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తిరుమలలో గదుల కేటాయింపును తిరుమల తిరుపతి దేవస్థానం మరింత సులభతరం చేసింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపు కోసం 6 చోట్ల రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నది. శనివారం ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ కేంద్రాలను టీటీడీ ప్రారంభించనున్నది. జీఎస్సీ, బాలాజీ బస్టాండ్, కౌస్తుభం, రామ్భగీచ, ఎంబీసీ, సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటుచేయనున్నది. పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఎస్ఎంఎస్ ద్వారా గదుల సమాచారం అందనున్నది. ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాట్లుచేస్తున్నారు.