బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత
లక్షెట్టిపేట రూరల్, ఏప్రిల్ 2 : అసలే కరోనా కాలం.. పాటిజివ్ వచ్చిందంటే అటునుంచి అటే వెళ్లిపోయే బంధువులు.. డబ్బులిచ్చినా కనీసం నిత్యావసర సరుకులు అందజేసే వారు లేని ఆపద కాలం.. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు నేనున్నానంటూ.. ఆపద్బాంధవుడిలా మారాడు మున్సిపాలిటీలోని ఉత్కూర్కు చెందిన అడ్లూరి హరీశ్. నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల సరుకులు అందిస్తానని ముందుకొచ్చాడు.
మున్సిపాలిటీలో ‘ఎవరికీ ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదించండి’ అంటూ తన వాట్సాప్ నంబర్ను లోకల్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. కొవిడ్ బాధితులు నేరుగా ఫోన్ చేయడమే కాకుండా.. తమకు అవసరమైన వస్తువులను వాట్సాప్లో పంపిస్తే చాలు.. దగ్గరుండి తీసుకొచ్చి అందిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని అవగాహన కల్పిస్తున్నాడు. కరోనా టెస్ట్లు చేయించుకోవడానికి ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులు కనీసం భౌతిక దూరం పాటించకపోవడంతో సొంత డబ్బులతో సున్నం తీసుకొచ్చి సర్కిళ్లను ఏర్పాటు చేశాడు. ఈయన సేవలను పలువురు అభినందిస్తున్నారు.
బాధితుల బాధలు చూడలేకే..
కరోనా పాజిటివ్ వచ్చి కనీసం నిత్యావసర సరుకులు కూడా తీసుకురావడానికి ఎవరూ లేని వారి బాధలను దగ్గరగా చూశా. వారికి అవసరమైన సరుకులు అందించకపోతే వారు బయటకు వస్తే ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంది. అందుకే వారు బయటకు రాకుండా నేనే వారికి సరుకులు అందించాలని నిర్ణయించుకున్నా. ఎందరో వద్దు అన్నప్పటికీ సామాజిక బాధ్యతగా వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నా.