న్యూఢిల్లీ: విదేశీ సంస్థలు వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీతోపాటు దాదాపు 15 సంస్థలకు రిలీఫ్ నిచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. ఈ మేరకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. వివాదాస్పద వెనుకటి తేదీ నుంచి వసూలు చేసే రెట్రోస్పెక్టివ్ టాక్స్ విధానానికి స్వస్తి చెప్పేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయమై ఆదాయం పన్ను శాఖ చట్టం సవరణకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టారు.
దీని ప్రకారం 2012 మే 28వ తేదీకి ముందు జరిగిన పరోక్ష ఆస్తుల బదిలీపై ఎటువంటి పన్నులు ఉండవు.అంతే కాదు. రెట్రోస్పెక్టివ్ పన్ను విధానం కింద వసూలు చేసిన మొత్తం వడ్డీ లేకుండా రీఫండ్ చేయనుంది. కొన్నేండ్ల తరబడి దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం నెలకొందని కేంద్రం వ్యాఖ్యానించింది.
ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను విధానంతో ఇన్వెస్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అందుకే ఈ విధానం రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.వొడాఫోన్, కెయిర్న్ ఎనర్జీ తదితర సంస్థలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్లో దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్రానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొచ్చింది. 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని తెచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని తొలుత వొడాఫోన్.. తాజాగా కెయిర్న్ ఎనర్జీ సంస్థలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. ఇటీవల విదేశాల్లోని ఎయిర్ ఇండియా ఆస్తులను కెయిర్న్ ఎనర్జీ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది.