హైదరాబాద్, జూలై 29: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,120.15 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.340.95 కోట్ల లాభంతో పోలిస్తే మూడింతలు అధికమని బ్యాంక్ పేర్కొంది. కానీ, మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.1,269.18 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం తగ్గింది. బ్యాంక్ ఆదాయం రూ.20,487 కోట్ల నుంచి రూ.20,666 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.3,593.33 కోట్ల నిధులను వెచ్చించింది. ఏడాది క్రితం 14.95 శాతంగా(రూ.97,189.95 కోట్లు) ఉన్న బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ గత త్రైమాసికంలో 13.60 శాతానికి (రూ.87,762.19 కోట్లు) తగ్గగా, ఇదే సమయంలో నికర ఎన్పీఏ కూడా 4.97 శాతం(రూ.28,913.50 కోట్లు) నుంచి 4.69 శాతానికి(రూ.27,437.45 కోట్లు) దిగొచ్చినట్లు వెల్లడించింది.