కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగులకు ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తమ ఉద్యోగులకు హితబోధ చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని డివిజన్లకు చెందిన మేనేజర్లతో ఆయన గురువారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురిం చి మాట్లాడారు. వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించాలన్నారు. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లాలని సూచించారు. ఇప్పటికే అర్హులైన రైల్వే సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి జోన్లో వ్యాక్సినేషన్ కేద్రాలను ఏర్పాటుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సౌకర్యాలపై ఆయన కూలంకషంగా సమీక్షించారు. పరిస్థితులకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆయన డివిజనల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రైళ్ల శానిటైజేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.